PAWAN KALYAN | ఎన్టీఆర్‌ తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు : పవన్‌ కళ్యాణ్‌

Sr.Ntr @100 Years | విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. శత జయంతి వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన 100వ జయంతి సందర్భంగా పలువురు శద్ధాంజలి ఘటిస్తున్నారు. పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ సోషల్ మీడియాలో ఉద్వేగపూరిత నోట్‌ను పంచుకున్నాడు.

‘చరిత మరువని నటనా కౌశలం. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భాన అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది. ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎన్.టి. రామారావు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’ అంటూ నోట్‌ను షేర్‌ చేశాడు.

2023-05-28T08:06:14Z dg43tfdfdgfd