చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌.. కొనసాగుతున్న పోలీసుల వేట

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 100 కార్లతో అమృత్‌పాల్‌ ముఠాను వెంబడించారు. అతను చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. దీంతో బైక్‌పై పారిపోతున్న అమృత్‌పాల్‌‌ను సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. అయినా పోలీసులకు చిక్కలేదని జలంధర్ పోలీస్ కమిషనర్ కులదీప్ సింగ్ చహల్ వెల్లడించారు. అతడి రెండు కార్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు గన్‌మెన్లను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద ఆయుధాల చట్టబద్ధతను పరిశీలిస్తున్నామని వివరించారు.

కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని, అమృత్‌పాల్‌ సింగ్‌ను త్వరలోనే పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 78 మంది ఖలిస్థాన్‌ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీస్థాయిలో ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే దల్జీత్ సింగ్ కలసీని హరియాణాలోని గురుగ్రామ్‌లో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడు జిల్లాలకు చెందిన పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. కాగా, అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు.

దీనిని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగి బీభత్సం సృష్టించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. శనివారం జలంధర్‌లోని షాకోట్‌కు అతడు వస్తున్నట్లు సమాచారం అందింది. ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్‌, అతడి అనుచరులను అరెస్ట్‌ చేసేందుకు జలంధర్‌, మొగా పోలీసుల బృందం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలియగానే అమృత్‌పాల్‌ పారిపోయాడు. 78 మంది అనుచరులను అరెస్టు చేశారు.

ఈ అరెస్టుల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తకుండా పంజాబ్‌ వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపి వేస్తూ రాష్ట్ర హోం వ్యవహారాలు, న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌, మొబైల్‌ రీఛార్జి మినహా మిగిలిన మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. జల్లుపూర్ ఖైరా గ్రామాన్ని పారామిలటరీ బలగాలు ముందుగానే చుట్టుముట్టాయి. జీ20 సదస్సు ముగిసే వరకూ పంజాబ్ ప్రభుత్వం వేచిచూసే ధోరణితో ఉంది.

Read More Latest National News And Telugu News

2023-03-19T02:48:41Z dg43tfdfdgfd