తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఉగాది సందర్భంగా ఈ రెండ్రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంతకు ముందు మార్చి 21వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరపనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు. అలాగే మార్చి 20, 21వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి, అనంతరం ఆలయ శుద్ధి చేస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. తర్వాత బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం చేస్తారు.

ఇక, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కూడా నిలిపివేసినట్లు టీడీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.

2023-03-19T15:35:26Z dg43tfdfdgfd