భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కరుడుగట్టిన కమ్యూనిస్టు వాదిగా పేరొందిన నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది. గుమ్మడి నరసయ్య చేసిన పోరాటాలను, అభివృద్ధి పనులను ఆదర్శంగా తీసుకుని ఆయన జీవిత చరిత్రను వెండితెరకు ఎక్కించనున్నారు. రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు.
కానీ అ మాటలకు గుమ్మడి నరసయ్య విరుద్దం అని ఈ ప్రాంతవాసులు అంటుంటారు. అయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే ఉంటారు. సింప్లిసిటీనే మైంటైన్ చేస్తారు. ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు శాసనసభ నియోజకవర్గ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
గుమ్మడి నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా ఇంతే సింప్లిసిటీని మైంటైన్ చేసారు. బస్సులో, రైల్లో హైదరాబాద్ కి రావడం, ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం, పార్టీ ఆఫీస్ లో పడుకోవడం ఇది అయన ట్రాక్ రికార్డు. ఇప్పటికి అయన పేరు మీద కొద్దిగా పొలం తప్ప మరేమీ లేదు.
ఇంత సింప్లిసిటీగా బతికే లీడర్ ని ఇక మనం భవిషత్తులో చూడలేం కావచ్చు. బహుశా అందుకే కాబోలు ఆయన జీవిత చరిత్రను వెండితెరపై ఎక్కించేందుకు సిద్ధమయ్యారు పలువురు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు. ఈ చిత్రీకరణ ప్రారంభోత్సవాన్ని ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కాచనపల్లి అమరవీరుల స్థూపంవద్ద నివాళులు అర్పించి మొదలు పెట్టారు.
అయితే సినిమా యూనిట్ బృందం వస్తున్నారని తెలుసుకున్న ప్రజాపందా పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఎగురవేసి, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ డైరెక్టర్ పర్మేష్, నిర్మాత మహేష్, మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదిగిన ఆయన తనకంటూ ఏమీ సంపాదించు కోకుండా కేవలం ప్రజా సమస్యలపైనే పోరాటం చేశాడని, ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాడన్నారు. ఆయన బయోగ్రఫీతో సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందన్నారు. దేశంలో నెంబర్ వన్ గాఉన్న ఓ హీరోతో చిత్రం రూపొందుతుందన్నారు. ఆ హీరోను కూడా త్వరలో పరిచయం చేస్తామన్నారు.
గుమ్మడి నర్సయ్య ప్రస్థానంపై ఈ నియోజకవర్గంలో తమ బృందం రెండేళ్లపాటు అధ్యయనం చేసిందన్నారు. జిల్లా అధికారులు, రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజల నుంచి గుమ్మడి నర్సయ్య గురించి ఎన్నోవిషయాలు తెలుసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. బిర్యానీ ప్యాకెట్లకే పార్టీ మారుతున్న ఈ రోజుల్లో నమ్మిన సిద్ధాంతానికి జీతం లేకుండా పనిచేసిన మట్టిమనిషి జీవిత కథ ఎందరో యువకులకు స్ఫూర్తి దాయకమన్నారు.
షూటింగ్ ప్రారంభం తొలి అడుగు కాచనపల్లి నుంచేనని తెలిపారు. ముందుగా రెండు పాటలు విడుదల చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో కెమెరా మెన్ అఖిల్, రైటర్ విశ్వన్, యాక్టర్ బాషా, గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, చిన చంద్రన్న, ఈసం శంకర్, శాంతయ్య, బొర్ర వెంకన్న, బోసు, ప్రసాద్, బిచ్చా, పృద్వీ, చంద్రన్న, గణేష్ కుమార్, రామచంద్రు పాల్గొన్నారు.
2023-03-18T09:11:16Z dg43tfdfdgfd