FUNERAL: మరణంలోనూ వీడని స్నేహం.. మండుతోన్న మిత్రుడి చితిలోకి దూకి వ్యక్తి ఆత్మార్పణం

స్నేహితుడి మరణం తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి.. అతడి అంత్యక్రియలు జరుగుతుండగా చితిలోకి దూకి తానూ ఆత్మార్పణం చేసుకున్నాడు. గుండెల్ని పిండేసే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ జిల్లా నగ్లా ఖంగ్రా పరిధిలోని మాడయి గ్రామానికి చెందిన అశోక్‌ కుమార్‌ (42) కేన్సర్‌ బాధితుడు. వ్యాధి ముదిరి తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం అశోక్ మృతి చెందాడు. ఈ వార్త తెలిసిన అతడి స్నేహితుడు ఆనంద్ (40) తన మిత్రుడి కడసారి చూడాలని గ్రామానికి చేరుకున్నాడు. అంతిమ సంస్కారాల కోసం అశోక్ మృతదేహాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకొచ్చారు.

ఈ క్రమంలో చితిపై అశోక్‌ మృతదేహానికి నిప్పంటించారు. ఇదే సమయంలో ఆనంద్ ఒక్కసారిగా చితిలోకి దూకాడు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అతడ్ని బయటకు తీసి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 90 శాతం గాయాలైన ఆనంద్‌ను చికిత్స కోసం హుటాహుటిన అంబులెన్స్ సాయంతో ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఆగ్రా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్ మృతిచెందాడు.

అయితే, అక్కడున్నవారు కొందరు మాత్రం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆనంద్‌ కళ్లుతిరిగి మండుతున్న ఆ చితిలో పడిపోయాడని చెబుతున్నారు. అందరూ చూస్తున్నంతలోనే అతని శరీరం 90శాతం మేరకు కాలిపోయిందని పేర్కొన్నారు. కాగా ఆనంద్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఆనంద్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Read More Latest National News And Telugu News

2023-05-28T08:34:49Z dg43tfdfdgfd