MM KEERAVANI - రాజమండ్రిలో తిన్న చామదుంపల పులుసు.. 10 రోజులైనా టేస్ట్ అలానే ఉంది: ఎం.ఎం.కీరవాణి

ఎం.ఎం.కీరవాణికి (MM Keeravani) సంగీతం తర్వాత అంత ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది ఆహారం. అవును.. ఆయన మంచి భోజన ప్రియుడు. సంప్రదాయ వంటకాలను ఆయన ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ స్థానిక సంప్రదాయ వంటకాలను ఆయన రుచి చూడకుండా ఉండరు. తాజాగా ఆయన రాజమండ్రి వెళ్లారు. గతనెల 19వ తేదీన రాజమండ్రి వెళ్లిన కీరవాణి.. అక్కడి సితార రెస్టారెంట్‌లో భోజనం చేశారు. చామదుంపల పులుసుతో ఆయన లాగించారట. అయితే, ఆ రుచి 10 రోజులు గడిచినా ఇంకా తన మనసులో అలానే ఉండిపోయిందని అంటున్నారు కీరవాణి.

‘రాజమండ్రి సితార హోటల్‌లో పది రోజుల క్రితం తిన్న చామదుంపల పులుసు టేస్ట్ ఇంకా మనసులో నుంచి పోలేదు. దానికంటే ముఖ్యంగా.. సుమన్ గారు, మీరు చూపించిన ఆదరాభిమానాలు కూడా మనసులో ఉండిపోయాయి’ అని ఒక వీడియోను కీరవాణి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఈ వీడియోకు ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టారు. ‘ఆతిథ్యం అనేది మన సంస్కృతి, మన గౌరవం’ అని కీరవాణి పేర్కొన్నారు. కీరవాణి పోస్టుకు రాజమండ్రి వాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశం గర్వించదగిన సంగీత దర్శకుడు రాజమండ్రిలోని ఒక రెస్టారెంట్‌ గురించి, దాని యజమాని గురించి గొప్పగా చెప్పడం గొప్ప విషయమని కామెంట్లు పెడుతున్నారు.

కీరవాణి ఫేస్‌బుక్ పోస్టుకు సితార రెస్టారెంట్ యజమాని సుమన్ చౌదరి కూడా స్పందించారు. కీరవాణికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడంలేదని పేర్కొన్నారు. భోజనాన్ని అమితంగా ఇష్టపడే కీరవాణి.. తనకున్న ఒక చెడ్డ అలవాటు ‘బద్దకం’ అని చెబుతుంటారు.

ఇక కీరవాణి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కీర్తి ఆకాశాన్ని అంటింది. RRR సినిమాతో కీరవాణి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటతో భాష, సంస్కృతితో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులందరితోనూ స్టెప్పులేయించారు. ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక కీరవాణికి ముగ్గురు సంగీత దర్శకులంటే మహా ఇష్టమట. వాళ్లెవరో కాదు.. కేవీ మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా. తన పాటల్లో వారి ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తుంటుందని కీరవాణి పలుమార్లు చెప్పారు. ఇక నటీనటుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రిలను కీరవాణి ఎక్కువగా ఇష్టపడతారట. దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు అంటే చాలా ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీరవాణికి ఇష్టమైన గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి.

2023-06-01T10:46:48Z dg43tfdfdgfd