PUNJAB: గురుద్వారాలో 45 నిమిషాలు గడిపి.. పూజారి ఫోన్ వాడి, అక్కడే వేషం మార్చిన అమృత్‌పాల్‌!

పరారీలో ఉన్న వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) కోసం పోలీసులు, కేంద్ర బలగాల సంయుక్త గాలింపు ఐదో రోజుకు చేరింది. అతడు ఎక్కడన్నుదీ ఇంకా పోలీసులకు తెలిరాలేదు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్‌ సింగ్‌ శనివారం మధ్యాహ్నం 45 నిమిషాలు గురుద్వారాలో గడిపి, అక్కడే దుస్తులు మార్చుకున్నట్టు తెలిసింది. ప్రార్థన అనంతరం ఆహారం కూడా తీసుకున్నాడని ఈ విషయాన్ని నంగల్ అంబియన్ గురుద్వారాకు చెందిన పూజారి రంజిత్ సింగ్, ఆయన భార్య నరీందర్ కౌర్ మీడియాకు వెల్లడించారు.

‘అమృత్‌‌పాల్‌ సింగ్, మరో నలుగురు అనుచరులతో కలిసి శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గురుద్వారాకు వచ్చి 1.45 గంటల వరకు ఉన్నాడు. ఏదైనా గలాటా సృష్టించడానికి వచ్చారని భావించాం.. తాము ఒక ప్రోగ్రామ్‌కు వెళ్తున్నామని, తమకు కొన్ని దుస్తులు కావాలని అడిగారు.. మాకు ఆశ్చర్యమనిపించినా, మా కుమారుడి దుస్తులు ఇచ్చాం... తర్వాత మా ఫోన్ అడిగి తీసుకున్నారు.. వెళ్లిపోవడానికి ముందు దానిని తిరిగిచ్చేశారు... వాళ్లు ధరించిన నీలం, కాషాయం రంగు తలపాగాను తీసేసి, వేరే తలపాగాలను ధరించారు.. వారి ప్రవర్తనపై మాకు ఎటువంటి అనుమానం రాలేదు.. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సాయంత్రం 4 గంటల వరకు మాకు తెలియదు.. ’ అని వారు తెలిపారు.

అమృత్‌పాల్‌‌ కోసం పంజాబ్‌(Punjab) పోలీసులు శనివారం పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు రాక గురించి తెలుసుకుని తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ బెంజ్ కారును అమృత్‌పాల్‌ అక్కడే వదిలేసి.. బైక్‌పై పరారయ్యాడు. అనంతరం బ్రీజా కారులో వేరే మార్గంలో పారిపోయాడు. అతడు పరారైన దృశ్యాలు జలంధర్‌లోని టోల్‌ప్లాజా వద్ద సీసీటీవీలో రికార్డయ్యాయి. అమృత్‌పాల్‌ పరారయ్యేందుకు సహకరించిన నలుగురిని పంజాబ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వేషం మార్చుకుని, నల్లని కళ్లద్దాలు ధరించి, ఓ బైకు వెనుక కూర్చొని నిందితుడు తప్పించుకున్నట్లు వారు తెలిపారు. నిందితుడిపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు.

2023-03-22T08:30:00Z dg43tfdfdgfd