HYDERABAD: 'బంధాల బంధం తెంచుకుని బతకాలని ఉంది.. నా బతుకు నేనే బతుకుతా'

Married woman Missing: 'బంధాల బంధం తెంచుకుని బతకాలని ఉంది.. నా బతుకు నేనే బతుకుతా' అంటూ ఓ గృహిణి ఆడియో సందేశం పెట్టి కనిపించకుండా పోయింది. అది విన్న భర్త, ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ రాజనగర్‌కు చెందిన పాల లక్ష్మణ్ కుమార్‌కు ఏడేళ్ల క్రితం అశ్విని (28) అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది. లక్ష్మణ్ ప్రైవేట్ జాబ్ చేస్తుండగా.. అశ్విని ఓ వస్త్రాల షోరూంలో పనిచేస్తుంది.

అయితే గత కొంత కాలంగా అశ్విని తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంది. తనకు స్వతంత్రంగా బతకాలని ఉందని.. తాను వెళ్లిపోతానంటూ భర్తతో తరుచూ గొడవ పడేది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. ఆమెను మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లినా.. ప్రవర్తనలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. గత నెల 31న యథావిధిగా డ్యూటీకు వెళ్తున్నాని చెప్పి అశ్విని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎప్పుడూ సమయానికే ఇంటికి వచ్చే అశ్విని ఆరోజు మాత్రం రాలేదు. రాత్రి పది వరకు భర్త లక్ష్మణ్ వెయిట్ చేసినా.. ఆమె మాత్రం తిరిగి రాలేదు. కంగారు పడిన భర్త వెంటనే ఆమె పనిచేసే చోటుకు వెళ్లి ఆరాతీశాడు.

వస్త్ర షోరూం నిర్వహకులు చెప్పింది విని లక్ష్మణ్ షాక్‌కు గురయ్యాడు. ఆమె నెల రోజులు సెలవు పెట్టిందని గత కొన్ని రోజులుగా దుకాణానికి రావటం లేదని వారు చెప్పారు. ఒకసారిగా నిర్ఘాంతపోయిన భర్త.. వెంటనే ఈ విషయాన్ని తన అత్తమామలకు తెలియజేశాడు. అల్లుడి ఇంటికి చేరుకున్న అశ్విని తల్లిదండ్రులు.. విషయంపై ఆరా తీశారు. ఇంతలో అశ్విని తండ్రికి ఓ ఆడియో మెసేజ్ వచ్చింది. 'బంధాల బంధం తెంచుకుని స్వతంత్రంగా బతకాలని ఉంది.. నా బతుకు నేనే బతుకుతా' అంటూ అశ్విని వాయిస్ మేసెజ్ పెట్టింది. అది విన్న ఆమె భర్త లక్ష్మణ్, తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమె ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది.

ఆ తర్వాత బోరబండ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమె మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా ఆమె ఎటు వెళ్లి ఉంటుదనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Read More Telangana News And Telugu News

2023-06-04T06:05:41Z dg43tfdfdgfd