‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారు. గుండెల నిండా అభిమానంతో ఆ యుగ పురుషున్ని స్మరించుకుంటున్నారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను గుర్తుతెచ్చుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావిస్తున్నారు’ అని అన్నారు ప్రముఖ దర్శక నిర్మాత వై.వి.యస్.చౌదరి.
నేడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ‘అమెరికాలోని డెట్రాయిట్, హారీస్బర్గ్, నార్త్ కరోలినాలో జరిగే శత జయంతి ఉత్సవాల్లో నేను ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నా. ఎన్టీఆర్గారి వీరాభిమానిగా ఈ వేడుకల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు జాతిలో చైతన్యాన్ని నింపి విశ్వవేదికపై సగర్వంగా నిలిపిన మహానీయుడు ఎన్టీఆర్.
తెలుగు నేలపై కారణజన్ముడిగా కొనియాడబడుతున్న ఎన్టీఆర్ గురించి భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాల్లో భాగమవుతున్నా. ఎన్టీఆర్ తెలుగు నేలపై రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు. స్వీయ క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పబలంతో జీవితంలో అనుకున్నవన్నీ సాధించిన కర్మయోగి ఎన్టీఆర్. వ్యక్తిగత జీవితంలో నేను ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఎన్టీఆర్ వీరాభిమాని అనే బిరుదే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది’ అన్నారు.
2023-05-27T22:21:04Z dg43tfdfdgfd