VIJAYENDRA PRASAD: ఏపీ ఎన్నికల ప్రచారంలో రాజమౌళి తండ్రి.. మాజీ మంత్రి గెలుపు కోసం!

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కూటమి అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత, డైరెక్టర్ రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్రప్రసాద్‌ కైకలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ తరఫున కైకలూరులో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తినే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.

ఏలూరు లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా ఆటపాక నుంచి లోకుమూడి వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కైకలూరులోని సీఎన్‌ఆర్‌ కల్యాణవేదికలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేవారినే ఎన్నుకోవాలని సూచించారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎంతో అద్భుతమైన పాలనను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో కైకలూరుకు కామినేని నాయకత్వంలో మహర్దశ ఉంటుందన్నారు.

మరోవైపు విజయవాడలో కూడా సుజనా చౌదరి గెలుపు కోసం విజయేంద్ర ప్రసాద్ ప్రచారం చేశారు. భారత దేశ భవిష్యత్ కోసం మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని.. మోదీకి ఓటు వేయాలని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో అదే ఉందన్నారు. మోదీ గెలుపు కోసం అనేక మంది కృషి చేస్తున్నారని.. తాను కూడా తన వంతు కృషి చేస్తున్నానన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T03:49:12Z dg43tfdfdgfd