పవన్ కళ్యాణ్ పదో తరగతి పాస్, ఆస్తులు ఎంతో తెలుసా.. సంపాదనలో అంత విరాళమా?

కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ లీడర్ ఎస్వీఎస్ఎన్ వర్మతో పాటుగా నాగబాబు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. నామినేషన్ సందర్బంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పవన్ కళ్యాణ్.. అందులో తన ఆస్తిపాస్తుల గురించి ప్రస్తావించారు. గత ఐదేళ్ల తాలూకూ ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలను పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

మరోవైపు గడిచిన ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆస్తులు సుమారు 191 శాతం పెరిగినట్లు అఫిడవిట్ వివరాల ప్రకారం తెలుస్తోంది. తన పేరు, తన కుటుంబసభ్యుల పేరు మీద 163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తనకు 56 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య అన్నా పేరు మీదున్న కోటి విలువైన ఆస్తితో పాటు తమకు 46 కోట్ల విలువైన చరాస్థులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నెల్లూరులో పదో తరగతి పూర్తి చేసినట్లు ఉంది.

అలాగే 14 కోట్లు విలువైన కార్లు, బైకులు ఉన్నట్లు వెల్లడించారు. తన వద్ద హార్లే డేవిడ్‌సన్ బైక్, బెంజ్ మేబ్యాచ్, 5.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు, 2.3 కోట్ల విలువైన టయోటా క్రూయిజెర్ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తన కుటుంబానికి జన్వాడ, మంగళగిరి, జూబ్లీహిల్స్‌లో 118 కోట్ల స్థిరాస్థులు ఉన్నట్లు తెలిపారు. తనపై 8 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో సుమారుగా 114 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఐదేళ్లలో పవన్ ఆదాయం రూ.114.76 కోట్లు కాగా.. ఆదాయ పన్నుగా రూ.47.07 కోట్లు చెల్లించారు, జీఎస్టీకి రూ.26. 84 కోట్లు చెల్లించారు. మొత్తంగా 73.92 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఇక అప్పుల సంగతికి వస్తే.. రూ.64,26 కోట్ల అప్పులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు.. వ్యక్తుల నుంచి రూ.46 కోట్ల 70 లక్షలు అప్పు తీసుకున్నారు.ఇక గత ఐదేళ్లలో 20 కోట్ల వరకూ విరాళాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఈ విరాళాలు ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో జనసేన పార్టీకి రూ.17.15 కోట్లు విరాళంగా అందించారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ విరాళాలు అందించారు.

అలాగే పలు సంస్థలకు మూడు కోట్ల వరకూ విరాళాలు అందజేశారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ. కోటి. పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్‌కు కోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ రూ.30,11,717, పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T11:26:27Z dg43tfdfdgfd