WOMAN STABS HUSBAND | పెళ్లైన మరునాడు.. భర్త ప్రైవేట్‌ భాగాలపై కత్తితో దాడి చేసిన భార్య

పాట్నా: పెళ్లైన మరునాడు భర్త ప్రైవేట్‌ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది (Woman Stabs Husband). తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. సీతామర్హి ప్రాంతానికి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ సూర్య భూషణ్‌ కుమార్‌కు నేహా కుమారి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం ఉంది. భూషణ్‌కు అతడి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఈ సంగతి నేహా కుమారికి తెలిసింది. దీంతో పాట్నాకు రావాలని అతడ్ని ఒత్తిడి చేసింది. ఈ నెల 3న భూషణ్‌ కుమార్‌ పాట్నా చేరుకున్నాడు. నేహా కుమారి బలవంతంతో జూన్‌ 5న కోర్టులో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం నవ దంపతులు ఒక హోటల్‌లో బస చేశారు.

కాగా, తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధంపై భూషణ్‌, నేహా మధ్య హోటల్‌ గదిలో బుధవారం వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన నేహా, భూషణ్‌ ప్రైవేట్‌ భాగాలపై కత్తితో పొడిచింది. దీంతో అతడు కేకలు వేస్తూ హోటల్‌ గది నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మరోవైపు హోటల్‌కు చేరుకున్న పోలీసులు గాయపడిన భూషణ్‌ కుమార్‌ను పాట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడి ప్రైవేట్‌ భాగాలపై కత్తితో దాడి చేసిన నేహా కుమారిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

2023-06-08T10:17:18Z dg43tfdfdgfd