AMBATI RAYUDU : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు.  ఆయన ఇటీవలి కాలంలో సీఎం జగన్ ను ప్రశంసిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందని కొన్ని మీడియా సంస్థలకు చెప్పారు. అలాగే క్రికెట్ అకాడెమీ కూడా పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ చర్చనీయాంశమవుతోంది. గుంటూరులో పుట్టిన అంబటి  రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నారు.  ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నానని  కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతానని  గతంలో ప్రకటించారు. సీఎం జగన్ తో రెండో సారి భేటీ కావడంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని చెప్పుకుంటున్నారు.  

అంబటి రాయుడు టిక్కెట్ కూడా రెడీనా 

హైదరాబాద్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటికీ  తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. పొన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు  కిలారి రోశయ్య ఉన్నారు. ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తే ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే నర్సరావుపేట ఎంపీ టిక్కెట్ కు పరిశీలించవచ్చని చెబుతున్నారు. అంబటి రాయుడు ఐపీఎల్ లో చెన్నై టీమ్ కు ఆడారు. చెన్నై టీమ్ ఓనర్ శ్రీనివాసన్ కు సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో  రాయుడు వైసీపీలో చేరిక కోసం ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగినట్లుగా  భావిస్తున్నాు. 

పొలిటికల్ కెరీర్‌కు దూకుడు వర్కవుట్ అవుతుందా ?

అంబటి రాయుడు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో సినిమా, క్రికెట్ స్టార్లకు ఉన్నంత క్రెజ్ ఎవరికీ ఉండదు. ఇక లోకల్ టాలెంటెడ్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు.. అనుకున్న విధంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్‌లో వేసిన అనేక తప్పటడుగులు..రిటైర్మెంట్ల ప్రకటనలు.. వివాదాలు ఇలా అనేక మజిలీల తర్వాత ఇప్పుడు ఆయన చూపు పొలిటికల్ కెరీర్ వైపు పడింది.  ఐపీఎల్ అవగానే రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు జగన్ తో భేటీలో తన రాజకయ భవిష్యత్ పై ఓ క్లారిటీకి రానున్నారు.  

క్రికెట్ అకాడమీ కూడా పెట్టే ఆలోచన !                       

ప్రతి క్రికెటర్ రిటైరైన తర్వాత ఓ అకాడమీ పెట్టాలని అనుకుంటారు. అంబటి  రాయుడు కూడా అలాగే అనుకుంటున్నారన్న ప్రచారం ఉంది. విశాఖలో స్థలం కేటాయిస్తే.. అక్కడే మంచి సౌకర్యాలతో క్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచనను కూడా సీఎం జగన్ ముందు ఉంచారని అంటున్నారు. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే అంబటి రాయుడు.. సీఎం జగన్ ను ట్విట్టర్‌లో పొగుడుతున్నారు కానీ.. నేరుగా  వైసీపీ చేరుతున్నానని ఎక్కడా ప్రకటించలేదు. 

2023-06-08T11:57:35Z dg43tfdfdgfd