కేసీఆర్, కేటీఆర్ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి
యాదగిరిగుట్ట/చండూరు, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మర్రిగూడ, నాంపల్లి, చండూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో కొందరు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారన్నారు. వారంతా జైలుకు వెళ్తారన్నారు. కేసీఆర్ కూతురు కవిత జైల్లో ఉన్నా ఆయన ఇప్పటివరకు చూడలేదన్నారు. కూతురిపై ప్రేమ లేని కేసీఆర్ బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం మాత్రం చేస్తున్నారన్నారు. అధికారం పోయిందని ఆగమాగం అవుతున్నారని, బస్సు యాత్రలో ఏం మట్లాడుతున్నారో కూడా ఆయనకే అర్థం కావడం లేదన్నారు. చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపించి తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కార్యకర్తలకు సూచించారు. రైతుభరోసా అందరికీ అందుతుందని, ఆగస్టు 15లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ క్యాండిడేట్ చామల కిరణ్కుమార్రెడ్డి, యాదాద్రి డీసీసీ చీఫ్ సంజీవరెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T02:33:11Z dg43tfdfdgfd