నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్

నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ కు చెందిన వ్యాపారిని ఈ నెల 1న కొణిజర్ల మండలం పల్లిపాడు విలేజ్ కు చెందిన కూలీ పని చేసుకునే దంపతులు రాయల వెంకటేశ్వర్లు, శ్రీలత నకిలీ పిస్టల్​తో బెదిరించినట్లు హవేలి సీఐ భానుప్రకాష్​ తెలిపారు. ఇంట్లోకి చొరబడి నక్సలైట్లమని చెప్పి లక్ష రూపాయలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి, రూ.5 వేలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

 వ్యాపారి ఫిర్యాదు మేరకు టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం శ్రీశ్రీ సర్కిల్ లో వెహికల్​ చెకింగ్​లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. టైలరింగ్, కూరగాయల వ్యాపారం చేస్తున్న వీరు సులువుగా డబ్బు సంపాదించాలని నకిలీ పిస్టల్​తో బెదిరించినట్లు పేర్కొన్నారు. వీరిపై ఇప్పటికే 12 కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ. 3 వేల నగదు, బొమ్మ పిస్టల్  స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T04:22:10Z dg43tfdfdgfd