నటి డింపుల్ హయాతికి 41ఎ నోటీసు ఇచ్చాకే విచారించాలి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సినీ నటి డింపుల్ జేపీ అలియాస్ డింపుల్ హయాతిపై నమోదైన కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు జారీ చేసిన తర్వాతే విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మే 17న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ హయాతి, న్యాయవాది విక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ జి అనుషమ చక్రవర్తి విచారించారు. తప్పుడు అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హయాతి తరఫు న్యాయవాది వాదించారు. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడి చేయించడం వల్లే ఆయన డ్రైవర్ పిటిషనర్లపై కేసు పెట్టారన్నారు. కారును ధ్వంసం చేశారనే ఆరోపణపై ఏవిధమైన ఆధారాలు చూపలేదన్నారు. దీనిపై పోలీసుల తరఫు ఏపీపీ గణేశ్ స్పందిస్తూ నిందితులు కారును ధ్వంసం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. ఈక్రమంలో ఇద్దరు పిటిషనర్లకు 41ఎ నోటీసులు ఇవ్వాలని, వాటిని అందుకున్న పిటిషనర్లు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.
©️ VIL Media Pvt Ltd. 2023-06-08T03:03:56Z dg43tfdfdgfd