భారత క్రికెట్ జట్టు పేసర్ ప్రసిధ్ కృష్ణ ఓ ఇంటివాడయ్యాడు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రసిధ్.. నిన్న పెళ్లి చేసుకున్నాడు. ప్రసిధ్ భార్య పేరు రచన. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, కృష్ణప్ప గౌతమ్ తో పాటు ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ లో ఆడే దేవదత్ పడిక్కల్ లు హాజరయ్యారు.
27 ఏండ్ల ప్రసిధ్.. గత ఐపీఎల్ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడాడు. రూ. 10 కోట్ల భారీ ధరతో అతడిని రాజస్తాన్ దక్కించుకుంది. కానీ ఈ ఏడాది గాయం కారణంగా అతడు భారత జట్టుతో పాటు ఐపీఎల్ ను కూడా మిస్ అయ్యాడు.
ఎవరీ రచన..?
రచన కూడా కర్నాటక వాస్తవ్యురాలే. కానీ ఉద్యోగం రిత్యా రచన ప్రస్తుతం యూనైటెడ్ స్టేట్స్ లో ఉంటుంది. టెక్సాస్ లోని డెల్ కంపెనీలో ఆమె ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లో పట్టా పొందిన రచన.. ఎంట్రప్రెన్యూర్ గా కూడా ఉంది.
ప్రసిధ్ వివాహానికి హాజరైన శ్రేయాస్, గౌతమ్ తో పాటు కర్నాటక టీమ్ మెంబర్స్ అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 27 ఏండ్ల ఈ కర్నాటక బౌలర్.. 2021లో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా భారత్ కు 12 వన్డేలు ఆడిన ప్రసిధ్.. 21 వికెట్లు పడగొట్టాడు. ఇక 2022 ఐపీఎల్ లో అతడు.. ట్రెంట్ బౌల్ట్ తో కలిసి రాజస్తాన్ పేస్ బౌలింగ్ కు కీలకంగా మారాడు. ఆ సీజన్ లో ప్రసిధ్.. 17 మ్యాచ్ లలో 19 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ ఫైనల్ చేరడంలో ప్రసిధ్ కూడా కీలక పాత్ర పోషించాడు. కానీ ఐదు నెలల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.