కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఎడమచేత్తోనే ఎందుకు దీవించేవారు..?!

తెలుగు రాష్ట్రాల ప్రజలు కొన్నేళ్ల కిందటి వరకూ రాముడు, కృష్ణుడి పేరు చెబితే నందమూరి తారక రామారావు (N.T. Rama Rao) రూపాన్నే ఊహించుకునేవారు. రాముడిని, కృష్ణభగవానుడిని నిత్యం పూజించినా.. వారి రూపాలు ఎలా ఉంటాయో ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. సినిమాల్లో ఎన్టీఆర్ రూపాన్ని చూసి.. రాముడు, కృష్ణుడు ఇలాగే ఉండేవారేమో అని ఊహించుకునేవారు. అందుకే ఎన్టీఆర్‌ను అంతలా ఆదరించారని నాటి ప్రముఖులు చెప్పారు. అభిమానులను అలరించేందుకు ఎన్టీఆర్ ఏకంగా 17 సినిమాలలో శ్రీకృష్ణుడి వేషం వేషారు. ప్రేక్షకుల మనసులో ఆ రూపం చెక్కుచెదరకుండా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని చెబుతారు.

అయితే, ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడి వేషం వేయడానికి ముందే చాలా మంది అభిమానులు ఆయణ్ని భగవత్ స్వరూపంగా భావించేవారట. ఇంట్లో ఎన్టీఆర్ ఫోటోలను పెట్టుకొని పూజించేవారు. అలాంటి అభిమానులకు మరింత ఆనందం కలిగించేందుకు ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు లాంటి దేవుళ్ల వేషాలు వేశారని, పురాణ గాథలు ఎంచుకొని వరుసగా సినిమాలు చేశారని సినీ రంగ నిపుణులు చెబుతారు.

అయితే.. కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ తన ఎడమ చేతితోనే భక్తులను ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు. అలా ఎందుకు చేసేవారని చాలా మందిలో సందేహం ఉండేది. కొంత మంది ఉండబట్టలేక ఆయణ్నే నేరుగా అడిగారట. దానికి ఎన్టీఆర్ ఇలా స్పందించారు..

‘మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలు చేసేటప్పుడు భార్యను ఎడమ వైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలో ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అంతెందుకూ.. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ చేతికి అలాంటి ప్రాధాన్యం ఉంది. అందుకే, ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను’ అని ఎన్టీఆర్ చెప్పారట.

వాస్తవానికి ఇది కూడా నిజం కాదు. ఆట పట్టించడానికే ఎన్టీఆర్ ఇలా చెప్పేవారట. అవతలివారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాక.. అసలు గుట్టు విప్పేవారట. ఇంతకీ ఆ అసలు నిజం ఏంటంటే..

సినిమాల కోసం తీసే ఫైటింగులు, అడ్వెంచర్లతో పాటు ఒక రోడ్డు ప్రమాదం కారణంగా ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి కాస్త పట్టు తప్పింది. దీంతో ఆయన తన ఎడమచేతినే ఎక్కువగా ఉపయోగించేవారు. సినిమాల్లో పురాణ పాత్రలు వేసినప్పుడు గద, ధనస్సు, ఇతర వస్తువులను ఉపయోగించడానికి ఎక్కువగా ఎడమ చేతినే వాడేవారు. ఇదే క్రమంలో ఎడమ చేతితోనే దీవెనలు ఇచ్చేవారట. సెంటిమెంట్‌ను ఎక్కువగా నమ్మే ఎన్టీఆర్.. అలాంటి పాత్రలన్నీ సూపర్, డూపర్ హిట్ కావడంతో.. అదే కంటిన్యూ చేశారట.

దటీజ్ ఎన్టీఆర్..

నమ్మకాల విషయంలో ఎన్టీఆర్ మొండిగా వ్యవహరించేవారట. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు.‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలోని ఒక సీన్‌ను కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే.. ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి, 3 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన తర్వాతే సినిమాను విడుదల చేసుకున్నారు.

తెలుగు వారి ఆచారాలు, సంప్రదాయాలకు ఎన్టీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తన నివాసానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్.. బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా ఆయనకు నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారట.

తెలుగువారికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకే 1982లో ‘తెలుగుదేశం పార్టీని’ స్థాపించారు ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన తర్వాత కేవలం 90 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 35,000 కిలోమీటర్లు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. అది ఇప్పటికీ ఒక ప్రపంచ రికార్డు. దటీజ్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.!!

(1923 మే 28న నిమ్మకూరులో ఎన్టీఆర్ జన్మించారు. నేడు ఆయన శత జయంతి)

100551262

100382491

2023-05-27T18:17:51Z dg43tfdfdgfd