ANCHOR RAVI: నా ఓటు ఆయనకే.. పవన్ కళ్యాణ్‌ హీరోగా ఇష్టం.. నేను వేయమంటే జనం వేయరుగా: యాంకర్ రవి

మొన్నటి వరకూ టీవీ వాళ్లంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉండేది కానీ.. ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్‌లు సైతం సినిమా వాళ్లతో సమానంగా క్రేజ్ సంపాదిస్తున్నారు. డబ్బుకి డబ్బు పేరుకి పేరు అన్నట్టుగా సినిమా వాళ్లతో పోటీ పడుతున్న టీవీ ఆర్టిస్ట్‌లు.. పాలిటిక్స్‌లో సైతం కీలకంగా మారారు. ఒకప్పుడు ఎన్నికలు వస్తే.. సినిమా ఆర్టిస్ట్‌లను ప్రచారానికి పిలిచేవారు. కానీ.. ఇప్పుడు టీవీ వాళ్లకి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల నేపథ్యంలో చాలామంది టీవీ ఆర్టిస్ట్‌లు, జబర్దస్త్ కమెడియన్లు పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేస్తుండగా.. టీవీ యాంకర్లు సైతం ప్రచారంలో భాగం అవుతున్నారు.

యాంకర్ శ్యామల వైసీపీ తరుపున విరివిగా ప్రచారం చేసి.. పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతుండగా.. ఏపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాంకర్ రవి. ఆయన హోస్ట్ చేస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీవీ షో 600 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసుకోవడంతో.. మీడియాతో ముచ్చటించిన రవి.. ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు.

‘‘నాకు పాలిటిక్స్‌పై అవగాహన లేదు. చాలామంది యాంకర్లు, ఆర్టిస్ట్‌లు మాట్లాడుతున్నారంటే.. వాళ్లు పాలిటిక్స్ గురించి తెలుసుకున్నారు.. మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే.. తెలిసి మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. నన్ను కూడా ఎలక్షన్స్‌లో ప్రచారం చేయమని చాలామంది అడిగారు. తెలంగాణ ఎన్నికల టైంలో కూడా నన్ను అడిగారు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు.. అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని అంటారు. కానీ నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడితే.. జనసేన, వైఎస్ఆర్‌సీపీ అని కాదు. నాకు పార్టీతో సంబంధం లేదు. ఆంధ్రప్రజలు బాగుండాలని కోరుకుంటా. నేనే మోడీగారి ఫ్యాన్‌ని ఆయన గెలవాలని కోరుకుంటున్నా. అది నా అభిప్రాయం. నా ఓటు ఆయనకే. అలాగని నేను ఆయనకి ప్రచారం చేయలేను. నాకు వచ్చింది యాంకరింగ్.. అదే చేస్తున్నా.

పాలిటిక్స్‌లో సినిమా వాళ్లతో పాటు.. టీవీ వాళ్లకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే బుల్లితెర పవర్ అది. బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో.. అన్‌స్టాపబుల్ లాంటి షో చేశారంటే.. టీవీ పవర్ ఏంటో చూడొచ్చు. మంచు మనోజ్ గారు.. నాగార్జున గారూ.. ఇలా చాలామంది టీవీ షోలు చేస్తున్నారంటే.. టీవీ పవర్ పెరిగింది. ఓటీటీ ఎంత పవర్‌గా ఉందో చూస్తున్నాం. వెండితెర కంటే టీవీ పవర్ ఫుల్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ ఉందని వాళ్లతో ప్రచారం చేయిస్తున్నారు. వాళ్లు ప్రచారం చేస్తుంటే.. వాళ్ల మాట వినొచ్చు కానీ.. జనం మాత్రం వాళ్లు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటారో వాళ్లకే ఓటు వేస్తారు.

జనం చాలా క్లారిటీగా ఉంటారు. వాళ్ల తీర్పుని గౌరవించాలి. పవన్ కళ్యాణ్ నాకు హీరోగా చాలా ఇష్టం. పాలిటిక్స్ విషయానికి వస్తే.. జనానికి నచ్చితే ఆయనకి ఓటు వేస్తారు. ఏదో నేను చెప్పానని పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయరు. అలాగే నేను చెప్పాలని చంద్రబాబుకి ఓటేయరు.. జగన్‌కి ఓటేయరు. వాళ్లకి ఎవరు నచ్చితే వాళ్లకి ఓటు వేస్తారు. అసలు వాళ్లకి ఓటు వేయమని నేనెందుకు చెప్పాలి? వాళ్లకి తెలివిలేక కాదు కదా.. ఏం చేయాలో వాళ్లకి తెలుసు.

కాకపోతే ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు వేస్తేనే నిలదీసే హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఒకవేళ ఓటు వేయకపోతే వాళ్లు మూర్ఖులు’ అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ రవి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T14:19:27Z dg43tfdfdgfd