Salman Khan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత కొంతకాలంగా సల్మాన్ను టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang).. నటుడిని చంపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు నవీ ముంబై పోలీసులు తాజాగా తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. నటుడి హత్యకు మోడ్రన్ వెపన్స్ (modern weapons) కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను వంటి అధునాతన మారణాయుధాలను పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు.
ఇందుకోసం పాక్లోని ఆయుధ వ్యాపారితో వారు టచ్లో ఉన్నట్లు నిందితుల్లో ఒకరు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తమ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. అంతేకాదు 2022లో పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’తో నటుడిని హత్య చేయాలని ముఠా భావించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాల్లో బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ (Galaxy Apartments) దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆ దృశ్యాల ఆధారంగా.. నిందితుల్ని గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందిలుల్ని విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకూ ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read..
NDA | ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం.. ఎంపీలకు మోదీ దిశానిర్దేశం
Turbulence | స్పానిష్ విమానంలో భారీ కుదుపులు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Motilal Nayak | మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?.. దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్
2024-07-02T06:01:26Z dg43tfdfdgfd