రూల్స్‌ బ్రేక్‌ చేసింది!

సినిమా ప్రచార కార్యక్రమాల్లో తారలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొనడం ఆనవాయితీ. అయితే అగ్ర కథానాయిక నయనతార మాత్రం ఈ నియమాన్ని అస్సలు పాటించదు. గత కొన్నేళ్లుగా ఈ అమ్మడు సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌కు ఓకే చేసే ముందే తాను ప్రచారానికి రాననే కండీషన్‌ను పెడుతుందీ భామ. చిరంజీవి, షారుక్‌ఖాన్‌ వంటి అగ్ర హీరోల సినిమాలైనా సరే.. ప్రమోషన్స్‌కి మాత్రం నయన్‌ రాదు. అయితే.. తాజాగా ఈ రూల్‌ని బ్రేక్‌ చేసింది నయన్‌. తమిళ చిత్రం ‘నేసిప్పయ’ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో ఆమె పాల్గొంది.

విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో అదితి శంకర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ మూవీ ప్రమోషన్‌లో నయనతార పాల్గొనడానికి ఓ కారణం ఉందట. విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహించిన ‘బిల్లా’ చిత్రంతోనే నయనతార మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది.

పైగా దర్శకుడు విష్ణువర్ధన్‌ తన కుటుంబ సభ్యుడిలాంటివాడని, తన మీద అభిమానంతోనే ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నానని నయనతార పేర్కొంది. ఇదిలావుంటే తాజాగా ‘మహారాజ’ఫేం మిథిలన్‌ సామినాథన్‌ చెప్పిన లేడీ ఓరియెంటెడ్‌ కథను నయన్‌ ఓకే చేసిందట. ‘మహారాజ’తో విజయాన్ని అందుకున్న మిథిలన్‌తో సినిమా చేస్తుండటం పట్ల నయన్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2024-07-02T22:34:22Z dg43tfdfdgfd