TTD:శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో చాన్నాళ్ల తర్వాత ఇలా!

కలియుగ వైకుంఠవాసుడి దర్శనం కోసం తిరుమల (Tirumala) వెళ్లే భక్తులకు శుభవార్త. మూడు రోజుల తర్వాత కొండపై రద్దీ ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో దర్శనం కోసం భక్తులను నేరుగా క్యూలైన్‌లోకి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. వారికి దర్శనం కూడా త్వరగానే పూర్తవుతోంది. ఎస్ఎస్డీ టోకేన్లు కలిగిన భక్తుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటల్లోనే దర్శనం పూర్తవుతున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం పూర్తయి వెలుపలికి వచ్చేస్తున్నారు.

ఇక, శ్రీవారిని జులై 2న మంగళవారం 67,398 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీకి కానుకలు రూపంలో రూ.4.09 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అలాగే, మరో 26,512 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం 8 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారని, ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇక, శనివారం నుంచి సోమవారం వరకూ వరుసగా మూడు రోజుల పాటు స్వామివారికి హుండీ ఆదాయం రూ.4 కోట్లపైనే వచ్చింది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు.

మరోవైపు, ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీలో మార్పులు శ్రీకారం చుట్టారు. ధర్మారెడ్డిని తప్పించి, ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించారు. ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే దూకుడు పెంచిన ఐఏఎస్ అధికారి... వ‌రుస‌గా స‌మీక్ష‌లు, త‌నిఖీల‌తో హోరెత్తిస్తున్నారు.

క్యూలైన్‌లో తిరిగి అన్నప్రసాదాల వితరణ ప్రారంభించారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా, శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు. భక్తుల క్యూ లైన్‌లు విస్తరించిన ప్రాంతంలో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరు లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్స్‌ను ఏజెన్సీ లు సరిగ్గా సరఫరా చేయకపోవడం, నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరా తదితర అంశాల ఉన్నట్టు అధికారులు చెప్పగా.. పలు సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం కాంట్రాక్టర్‌లను కఠినంగా హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్‌ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత మెరుగుపరిచేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని జేఈఓలను ఆదేశించారు.

మూడు రోజుల తర్వాత ఆకస్మిక తనిఖీలకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుద్ధ్యంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆయన జేఈవోలను ఆదేశించారు. ఇదే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆయన సూచించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-03T04:16:31Z dg43tfdfdgfd