YS SHARMILA: సొంత చెల్లెళ్ల కంటే.. భార్య తరుఫు బంధువులే ఎక్కువయ్యారా జగన్ అన్నా?

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ వారసుల మధ్య రాజకీయ పోరు పతాకస్థాయికి చేరింది. పులివెందులలో భారీ రోడ్ షో నిర్వహించిన ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. తన సోదరులు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల్లో న్యాయం కోసం చెల్లెల్లు ఒకవైపు, వైఎస్ జగన్ భార్య బంధువులు మరోవైపు తలపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్‌కు చెల్లెళ్ల కన్నా.. భార్య తరుపు బంధువులే ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటానికి కారణమేంటని.. వైఎస్ వివేకా కంటే అవినాష్ రెడ్డే ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు.

" పులివెందుల ప్రజలు ఓటుతో పాటు, ప్రేమను కురిపిస్తారని నమ్ముతున్నా. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్‌కు వైఎస్ వివేకా అలా. నెలలో 27 రోజులు ప్రజల మధ్యే తిరిగే నాయకుడు వివేకా. అలాంటి నేతను హత్యచేసి ఇవాళ్టికి ఐదేళ్లు పూర్తవుతోంది. ఈ 5 ఏళ్లలో సునీత న్యాయం కోసం తిరగని చోటు లేదు, తొక్కని గడప లేదు. ప్రజా కోర్టులో కొంగుచాటి న్యాయం చేయాలని కోరుతున్నాం" అని షర్మిల అన్నారు.

హత్య జరిగిన సమయంలో ఎవరు చేశారనేదీ తెలియలేదన్న షర్మిల.. ఆ తర్వాత సీబీఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి దోషి అని ఆధారాలు లభించినా.. అరెస్ట్ కాకుండా జగన్ అడ్డుపడుతున్నారని షర్మిల ఆరోపించారు. కర్నూలులో అరెస్ట్ చేయాలని చూస్తే మూడు రోజులు కర్ఫ్యూ పెట్టారని.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారిని విమర్శించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

" కడప ఎన్నికల్లో చెల్లెల్లు ఒకవైపు, జగన్ భార్య తరుఫు బందువులు ఒకవైపు. చెల్లెళ్ళ కన్నా నీకు, భార్య తరుపు బందువులు ఎక్కువ అయ్యారా?. చిన్న పిల్లాడు అని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు. అంతలా కాపాడేందుకు కారణమేంటి. వివేకా కన్నా అవినాష్ రెడ్డి ఎక్కువయ్యాడా. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు వివేకా. అలాంటి సొంత చిన్నాన్నను చంపేస్తే ఆ నిందితుడిని జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారు. మళ్లీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి కంటే మగాడు లేడా" అంటూ షర్మిల ప్రశ్నించారు.

వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడని జగన్ నమ్ముతున్నారంట. జగన్ కన్విన్స్ అయితే ప్రపంచం మొత్తం కన్విన్స్ అవ్వాలా?. కన్విన్స్ అవ్వాల్సింది జగన్ కాదు.. ప్రజలు, సీబీఐ, న్యాయస్థానాలు అంటూ షర్మిల వైఎస్ జగన్ మీద, వైఎస్ అవినాష్ రెడ్డి మీదు పులివెందుల బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు,

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T17:27:34Z dg43tfdfdgfd