చెప్పుతో చెంపపై కొట్టుకున్న జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే

జనసేన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనను తాను చెంపపై చెప్పుతో కొట్టుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు ఎన్నో రకాలుగా అన్యాయం జరిగిందని.. వైఎస్సార్‌సీపీకి ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో 'మీరు వినలేదు' అన్నారు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. గొడారిగుంటలోని తన కార్యాలయంలో కొందరు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆయనను కలిసి కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్‌ను హత్య చేయడం, సీతానగరంలో ఇసుక దందాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించడం వంటి పలు ఘటనలను గుర్తుచేశారు రామారావు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష పడినా వైఎస్సార్‌సీపీ ఆయనకు టికెట్‌ ఇవ్వడం.. ఎస్సీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాల రద్దు చేయడం దారుణమన్నారు. ఈఘటనలపై టీవీ రామారావు స్పందిస్తూ.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవడం మంచిదన్నారు.. కూటమికి ఎస్సీలు మద్దతు పలకాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. గడిచిన ఐదేళ్లలో దళితులు, బహజనులు హత్యలకు, అవమానాలకు గురయ్యారన్నారు. నిధులివ్వకుండా ఓ కార్పొరేషన్‌ పెట్టి మోసం చేశారన్నారు. అందుకే మాదిగలంతా కూటమికి మద్దతిస్తున్నారన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T04:49:23Z dg43tfdfdgfd