జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబమే రిచ్.. రెండు ఫ్యామిలీల ఆస్తుల వివరాలివిగో..!

‘వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో.. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వైఎస్ జగన్ వేల కోట్లు కూడబెట్టారు. క్విడ్ ప్రోకో ద్వారా ఆయన లక్ష కోట్ల దాకా సంపాదించారు..’ వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఆయనపై టీడీపీ చేసిన ఆరోపణలు ఇవి. దీనికి వైఎస్సార్సీపీ కూడా ధీటుగానే బదులిచ్చేది. ‘చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాక ముందు ఆయనకున్న ఆస్తి రెండెకరాల పొలం. అలాంటి వ్యక్తి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు’ అని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రశ్నించేవి. ఇప్పటికీ టైం వస్తే చాలు.. ఒకరి ఆస్తుల గురించి మరొకరు విమర్శలు గుప్పించుకోవడానికి రెడీగా ఉంటారు.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి కాసేపు పక్కనబెడదాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు కదా. ఈ సందర్భంగా.. చంద్రబాబు నాయుడు, లోకేశ్; వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల సంఘానికి అఫిడవిట్లను పరిశీలిస్తే.. జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబానికే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఇక్కడ జగన్ ఫ్యామిలీ అంటే ఆయన, ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు మాత్రమే. కానీ బాబు ఫ్యామిలీ విషయానికి వచ్చే సరికి ఆయన, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌‌లను కలిపి ఒకే ఫ్యామిలీగా చూస్తే.. ఆస్తుల్లో బాబు కుటుంబానిదే పై చేయిగా తేలింది.

ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం నారా లోకేశ్ కుటుంబ ఆస్తుల విలువ రూ.542 కోట్లు. అంటే లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ముగ్గురి పేరిట ఉన్న ఆస్తుల విలువ. ఇక చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.931 కోట్లు. ఈ ఐదుగురి ఆస్తులు కలిపితే.. రూ.1473 కోట్లు.

ఇక వైఎస్ జగన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ. 779.8 కోట్లు. ఇందులో జగన్ పేరిట ఉన్న ఆస్తులు రూ.529.87 కోట్లు కాగా.. ఆయన సతీమణి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.176.30 కోట్లు. మిగతా ఆస్తులు ఇద్దరు కుమార్తెల పేరిట ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. జగన్ ఫ్యామిలీ కంటే నారా కుటుంబం ఆస్తుల విలువ రూ.693 కోట్ల కంటే ఎక్కువే.

ఈ ఐదేళ్ల కాలంలో అటు నారా ఫ్యామిలీతోపాటు.. ఇటు వైఎస్ కుటుంబ ఆస్తుల సైతం బాగానే పెరిగాయి. జగన్ ఆస్తులు ఈ ఐదేళ్లలో 41 శాతం పెరిగాయి. 2019 అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తుల విలువ రూ.375 కోట్లు కాగా.. 2024 అఫిడవిట్లో రూ.529.87 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో భారతి ఆస్తులు రూ.124 కోట్ల నుంచి రూ.176.30 కోట్లకు చేరాయి.

మరోవైపు చంద్రబాబు, ఆయన సతీమణి ఆస్తులు సైతం ఈ ఐదేళ్లలో 39 శాతం పెరిగాయి. 2019 ఎన్నికల సమయంలో వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.668 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.931 కోట్లకు చేరింది. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తి రూ.36.36 కోట్లు. ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు రూ.895 కోట్లు. హెరిటేజ్ షేర్లతో కలుపుకొని చరాస్తులు రూ.810.37 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు. ఆమె పేరిట రూ.6.83 కోట్ల మేర అప్పులున్నాయి.

నారా లోకేష్ ఫ్యామిలీ ఆస్తులు ఈ ఐదేళ్లలో 45 శాతం పెరిగాయి. 2019లో లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ పేరిట రూ.373 కోట్ల ఆస్తులు ఉండగా.. 2024 నాటికి ఆస్తుల విలువ రూ.542 కోట్లకు చేరుకుంది. ఇందులో చరాస్తుల విలువ రూ.394 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ.148 కోట్లు. లోకేశ్ ఫ్యామిలీకి రూ.18 కోట్ల అప్పులున్నాయి.

ఆస్తులే కాదు.. కేసుల సంఖ్య విషయంలో ముగ్గురు నేతలు పోటాపోటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడిపై 2019కి ముందు రెండు కేసులు మాత్రమే ఉండగా.. జైలుకు వెళ్లాల్సిన వచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు సహా ఈ ఐదేళ్లలో బాబుపై మరో 22 కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్‌పై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ స్కామ్ సహా 24 కేసులు నమోదయ్యాయి. అంటే తండ్రీకొడుకులపై నమోదైన కేసుల సంఖ్య 48.

ఇక జగన్ విషయానికి వస్తే.. ఆయనపై ఆర్థిక నేరాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ పెట్టిన కేసులు సహా మొత్తం 26 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T09:56:12Z dg43tfdfdgfd