బాలకృష్ణ కంటే ఆయన భార్య వసుంధర ఆస్తులే ఎక్కువ.. ఎంతో తెలుసా?

Nandamuri Balakrishna Nomination: సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా గెలుపొందిన బాలయ్య.. హ్యాట్రిక్ లక్ష్యంగా మూడోసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి మూడోసారి కూడా తనదే గెలుపని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో ఆఫీసులో వసుంధరతో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

మరోవైపు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన బాలకృష్ణ అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించారు. ఎన్నికల ఆఫిడివిట్‌లో నందమూరి బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన (Nandamuri Balakrishna) ఆస్తుల విలువ 81 కోట్ల 63 లక్షలు. ఇక బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర (Nandamuri Vasundhra) ఆస్తుల విలువ వచ్చేసి 140 కోట్ల 38 లక్షల 83 వేలు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Teja) ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలుగా చూపారు. అప్పుల సంగతికి వస్తే తనకు 9 కోట్ల 9 లక్షల 22 వేలు.. తన భార్య వసుంధర పేరిట 3 కోట్ల 83 లక్షల 98 వేలు అప్పు ఉన్నట్లు బాలకృష్ణ అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఇక నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ హిందూపురంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు, నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు వేశామని గుర్తు చేశారు. అలాగే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన సంగతిని బాలకృష్ణ వివరించారు. ఇక నందమూరి కుటుంబమంటే హిందూపురం వాసులకు ప్రత్యేక అభిమానమని చెప్పిన బాలకృష్ణ.. వరుసగా తనను రెండుసార్లు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి కూడా ఆశీర్వదించాలని కోరారు.

మరోవైపు హిందూపురంలో బాలయ్యను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రత్యేక వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో బీసీ ఓటర్లను, రెడ్డి సామాజికవర్గానికి ఆకర్షించాలనే లక్ష్యంతో దీపికను వైసీపీ బరిలో నిలుపుతోంది. మరి హిందూపురం ఓటర్లు ఏం చేస్తారనేదీ జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది.

(ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై మీ అభిప్రాయాన్ని సమయం ఒపీనియన్ పోల్ ద్వారా తెలియజేయండి)

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T12:16:55Z dg43tfdfdgfd