AP ENNIKALU 2024: హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం. పవన్ గెలుపు కోసం మెగా కుటుంబంతో పాటుగా టాలీవుడ్ నుంచి పలువురు ప్రచారానికి వస్తున్నారు. అయితే తాజాగా సినీ హీరో సాయి ధరమ్‌తేజ్ పిఠాపురంలో ప్రచారం కోసం వచ్చారు.. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై దాడి ఘటన కలకలంరేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్‌తేజ్‌ కాన్వాయ్‌ ముందుకు వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్‌ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తికి వెళ్లారు. ధరమ్‌తేజ్‌ కోసం భారీగా జనసైనికులు తరలి వచ్చారు.. స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ వర్గీయులు జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చేలోపు వైఎస్సార్‌‌‌సీపీ వర్గీయులు బాణాసంచా కాల్చారు. దీంతో నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి.

సాయిధరమ్‌తేజ్‌ తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్‌ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది. బాధితుడ్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ గొడవకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌పై వేసిన రాయి తనకు తగిలినట్లు క్షతగాత్రుడు శ్రీధర్ చెబుతున్నారు. సాయిధరమ్‌తేజ్‌ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ నేతలు ఇలా చేశారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. ఓటమి భయంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నారని వర్మ ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని.. లేకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు. కడప, కర్నూలు నుంచి కొందరు పిఠాపురం వచ్చినట్లు తమకు పక్కాగా సమాచారం ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఈ దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రాయి సాయి ధరమ్‌తేజ్‌కు తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు జనసైనికులు. టార్గెట్ చేసి ఇలా చేశారని వైఎస్సార్‌సీపీ నేతలపై మండిపడుతున్నారు.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T03:30:52Z dg43tfdfdgfd