న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై (Vande Bharat Train) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలు కోచ్లోని రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే తీరుపై మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసి మధ్య నడిచిన వందే భారత్ రైలు నంబర్ 22416లోని ఒక కోచ్ నుంచి పైకప్పు నుంచి నీరు కారింది. దీంతో సీట్లు తడిచిపోవడం, ఆ కోచ్ ఫ్లోర్ నీటితో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
కాగా, ఒక వ్యక్తి ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. వందే భారత్ రైలు నిర్వహణ తీరు, కోచ్ నాణ్యతపై కొందరు మండిపడ్డారు. ‘షవర్తో కూడిన తొలి రైలు’ అని మరొకరు చమత్కరించారు. వందే భారత్ రైలులో వసూలు చేస్తున్న ధర ఎక్కువగా ఉన్నప్పటికీ సేవలు లోపభూయిష్టంగా ఉన్నాయని కొందరు విమర్శించారు.
మరోవైపు నార్తన్ రైల్వే దీనిపై స్పందించింది. పైపుల్లో బ్లాక్ కారణంగా నీరు లీక్ అయినట్లు తెలిపింది. సిబ్బంది ఈ సమస్యను సరి చేసినట్లు వివరణ ఇచ్చింది. ప్రయణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొంది.