BRAHMA ANANDAM MOVIE: తాత పాత్రలో 'బ్రహ్మానందం'.. కొడుకు గౌతమ్‌తో కలిసి సినిమా

ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న 'హాస్య బ్రహ్మ' బ్రహ్మానందం ఇటీవలి కాలంలో సినిమాలు తక్కువగానే చేస్తున్నారు. ముఖ్యంగా సెలక్టెడ్‌గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు.

బ్లాక్ బస్టర్ మసూద నిర్మాణ సంస్థ అయిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్‌లు కలిసి చేసిన ఓ ప్రోమోతో ఈ సినిమాను ప్రకటించింది. అయితే ఈ తండ్రికొడుకులు తెరపై తాత, మనవడిగా కనిపించనుండటం విశేషం.

ఈ ఏడాది డిసెంబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభమవుతుంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శాండిల్య పిసపాటి సంగీతాన్ని అందిస్తున్నారు.

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేశాడు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన గౌతమ్ ఆ తర్వాత బసంతి, మను అనే సినిమాల్లో నటించాడు. ఇక బ్రహ్మానందం ఇటీవల తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలా చిత్రంలో నటించారు. ఇందులో బ్రహ్మానందం తనదైన నటనతో ఇరగదీశారు. అయితే గతేడాది వచ్చిన 'రంగమార్తాండ' చిత్రంలో చక్రపాణి పాత్రలో నటవిశ్వరూపం చూపించారు బ్రహ్మానందం. ఆయన ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనంత సీరియస్ పాత్రలో కనిపించారు. తన సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతగా నవ్విస్తారో అంతేలా ఏడిపించగలను అని రంగమార్తాండ చిత్రంతో చూపించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T07:02:38Z dg43tfdfdgfd