DRAKSHARAMAM UPDATES: జీర్ణోద్ధరణ పనులతో ద్రాక్షరామం ఆలయం మరో 15రోజుల పాటు మూసివేత

Draksharamam Updates: ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన ద్రాక్షరామం పంచారామ క్షేత్రం మూసివేశారు. బుధవారం నుంచి 15 రోజుల పాటు ద్రాక్షారామంలోని భీమేశ్వ‌రాల‌యం మూసివేసిన‌ట్లు ఈవో తార‌కేశ్వ‌ర‌రావు తెలిపారు. దీంతో ఆలయంలో అన్ని ర‌కాల‌ దర్శనాలకు బ్రేక్ పడింది.‌ దీన్ని భక్తులంతా గమనించాలని ఆలయ యాజమాన్యం పేర్కొంది. ‌

రామ‌చంద్ర‌పురం మండ‌లంలోని ద్రాక్షారాం శ్రీ మాణిక్యాంబ స‌మేత భీమేశ్వ‌రాల‌యంలో మూల విరాట్‌ జీర్ణోద్ధరణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ ప‌నులు ఈనెల 15వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఆల‌య ఈవో తార‌కేశ్వ‌రరావు తెలిపారు. మొద‌ట ఈ ఆలయాన్ని మూల విరాట్‌ జీర్ణోద్ధరణ ప‌నుల నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 వ‌ర‌కు మూసివేశారు.

అయితే మూల విరాట్ జీర్ణోద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి కాలేదు. ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, దీంతో మ‌రో 15 రోజుల పాటు ఆల‌యాన్ని తెరిచే అవ‌కాశం లేద‌ని అధికారుల తెలిపారు.

పంచారామ క్షేత్రాల్లో ఒక‌టైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా రామ‌చంద్రపురం మండ‌లం ద్రాక్షారామంలో ఉంది. ద్రాక్షారామాన్ని కార్తీక‌మాసంలో ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు కోటి జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం ప్రాప్తిస్తుంద‌ని న‌మ్మ‌కం. ద్రాక్షారామం అత్యంత ముఖ్యమైన శైవక్షేత్రం.‌ ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం చేశారు.

అందువల్ల ఈ ప్రాంతానికి ద్రాక్షారామం పేరు వచ్చిందని అక్కడి వారు అంటారు. భీమేశ్వరస్వామి సహచరి మాణిక్యాంబను అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. అలాగే దక్షిణ కాశిగా, త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ద్రాక్షారామం ఆలయాన్ని పేర్కొంటారు.

కాకినాడ నుంచి 30 కిలోమీట‌ర్లు, రాజ‌మండ్రికి 60 కిలోమీట‌ర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. భీమేశ్వ‌రాల‌యంగా ప్ర‌సిద్ధి చెందిన ద్రాక్షారామ ఆల‌యంలో శివుడు లింగాకారంలో కొలువై ఉంటారు. ఈ ఆల‌యంలో లింగం స‌గ భాగం న‌ల్ల‌గానూ, సగ‌భాగం తెల్ల‌గానూ ఉంటుంది. అందుకే శివ‌ర‌మాత్మ‌ను అర్థ‌నారీశ్వ‌రుడ‌ని పిలుస్తారు. అందుకు ఈ ఆల‌యమే నిద‌ర్శ‌న‌మ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. 60 అడుగుల ఎత్తు క‌లిగి ఉన్న ఈ లింగానికి పై అంత‌స్తులోకి వెళ్లే పూజ‌లు నిర్వ‌హిస్తారు. భీమేశ్వ‌ర ఆల‌యంలో నందీశ్వ‌రుడు తూర్పు ముఖ‌ద్వారంలోని వెలసి ఉంటాడు.

కాశీ విశ్వేశ్వ‌రాల‌యంలోని వినాయ‌కుడి వ‌లే భీమేశ్వ‌ర ఆల‌యంలో వెల‌సిన విఘ్నేశ్వ‌రుడు కూడా కుడిచేతి మీదుగా తొండం క‌లిగి ఉంటారు. ద‌క్ష‌ప్ర‌జాప‌తి ఇక్క‌డ య‌జ్ఞం చేసిన కార‌ణంతోనే ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్న పేరు వ‌చ్చింది.

ద్రాక్షారామంలో మ‌హా శివ‌రాత్రి ఉత్స‌వాలు, స్వామివారి క‌ళ్యాణ మ‌హోత్స‌వ వేడుక‌లు, ఈ ఐదు క్షేత్రాల్లో వెల‌సిన శివ‌ప‌ర‌మాత్మ‌ను కార్తీక‌మాసాన ద‌ర్శించుకునే భ‌క్తులకు స‌క‌ల సంప‌ద‌లు, పుణ్య‌ఫ‌లాలు చేరుతాయ‌ని న‌మ్మ‌కం. తార‌కాసురుని కుమార‌స్వామ‌ని వ‌ధించే స‌మ‌యంలో ఆయ‌న కంఠంలోని అమృత లింగం చిన్నాభిన్న‌మై ఐదు ముక్క‌లైనయ్యాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అందులో ఒక‌టి ద్రాక్షారామంలో, రెండోది అమ‌రారాం (అమ‌రావ‌తి), మూడోది క్షీరారామం (పాల‌కొల్లు)లో, నాలుగోది సోమారాం (భీమ‌వ‌రం)లో, ఐదోది కుమారారామం (సామర్ల‌కోట‌)లో ప‌డ్డాయ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.

పంచారామాలెన్ని...అవి ఎక్కడెక్కడ ఉన్నాయి?

పంచారామాలు ఐదు. ఈ పంచారామాలు అన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయి.‌ అందువల్ల వాటి సందర్శన చాలా సులువుగా ఉంటుంది. వందల ఏళ్ల నాటి శిల్పకళలు, వేల ఏళ్ల చరిత్రతో పంచారామాలు ఉంటాయి. ఈ పంచారామాలన్నీ ప్రకృతి సోయగాల వడిలోనే ఉన్నట్టు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఈ పంచారామాలే ముఖ్యమైనవి. ఐదు పంచారామాల్లో రెండు తూర్పు గోదావరి, రెండు పశ్చిమ గోదావరి, ఒకటి గుంటూరు జిల్లాలో ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి సామర్లకోటలో కుమారబీమారామం, మరొకటి రామచంద్రాపురానికి సమీపంలో ద్రాక్షారామం. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి భీమవరానికి సమీపంలో ఉన్న సోమరారామం, మరొకటి పాలకొల్లులో ఉన్న క్షీరారామం. గుంటూరులోని అమరావతిలో ఒక పంచారామం ఉంది. దాన్ని అమరారామం అంటారు.

(జగదీశ్వరరావు జరజాపు, హెచ్‌టి తెలుగు)

2024-07-03T06:14:16Z dg43tfdfdgfd