JD LAKSHMI NARANAYA : సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహానీ ఎవరి నుంచి ? పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఏముంది ?

VV Lakshminarayana : సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన ప్రాణానికి ప్రమాదం ఉందని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం వీవీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డిపైనే అనుమానం                                           

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో  గాలి జనార్ధన్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు.  గాలి జనార్ధన్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేసినందుకు తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని జేడీ లక్ష్మినారాయణ తన ఫిర్యాదు పత్రంలో తెలిపారు. మైనింగ్ కేసుతో పాటు బెయిల్ కోసం జడ్జికి లంచం ఇచ్చిన కేసులోనూ జనార్ధన్ రెడ్డిని వీవీ లక్ష్మినారాయణ విధుల్లో ఉన్నప్పుడు అరెస్టు చేశారు. ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి అలాంటి కుట్ర చేస్తున్నట్లుగా వీవీ లక్ష్మినారాయణకు స్పష్టమైన సమాచారం వచ్చి ఉంటుందని అందుకే ఫిర్యాదు  చేశారని భావిస్తున్నారు.                       

సొంత పార్టీతో రాజకీయాలు చేస్తున్న  లక్ష్మినారాయణ                        

గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వీవీ లక్ష్మినారాయణ ఈ సారి సొంత పార్టీ పెట్టుకున్నారు. భై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకుని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ సారి పార్లమెంట్ కు కాక అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి నామినేషన్ వేసి ప్రచారం చేసుకుంటున్నరు. ఈ క్రమంలో తనపై దాడి జరుగుతుందని ఆయన అనుమానిస్తున్నారు.   సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందజేశారు.                         

 

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ లక్ష్మినారాయణే దర్యాప్తు అధికారి !    

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వీవీ లక్ష్మినారాయణ .. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి చెందిన సీబీఐ కేసుల్లో దర్యాప్తు అధికారి. ఆయనే అప్పట్లో జగన్ ను అరెస్టు కూడా చేశారు. ఆ కేసుల్లో చార్జిషీట్లు కూడా సీబీఐ జాయింట్ డైరక్టర్ గా ఉన్న లక్ష్మినారాయణ నేతృత్వంలోనే దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన తన సొంత కేడర్ మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ డీజీ క్యాడర్ లో స్వచ్చంద పదవీ విరమణ చేసి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఓ సారి ఓడిపోయిన తర్వాత రైతుల కోసం స్వచ్చంద సంస్థను పెట్టారు. రాజకీయంగానూ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.           

2024-04-26T10:58:57Z dg43tfdfdgfd