MANJUMMEL BOYS: ‘మంజుమ్మెల్ బాయ్స్’కు లీగల్ సమస్యలు - నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు

Case Filed On Manjummel Boys Producers: ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే చాలు.. దానికంటూ కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఆ సినిమాలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్‌లోకి ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా యాడ్ అయ్యింది. తాజాగా ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మారాడు పోలీసులు ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఆరూర్‌కు చెందిన పిటీషినర్ సిరాజ్ వలియతర.. ఈ కేసును ఫైల్ చేయించారు. ఈ మూవీ నిర్మాణ సంస్థలు అయిన పరావా ఫిల్మ్స్‌తో పాటు పార్ట్‌నర్ షాన్ ఆంటోనీపై కేసు ఫైల్ అయ్యింది.

చీటింగ్ కేసు..

సిరాజ్ వలియతర చెప్పినదాని ప్రకారం పరావా ఫిల్మ్స్, షాన్ ఆంటోనీ కలిసి ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాకు వచ్చే లాభాల్లో 40 శాతం షేర్ ఇస్తానని ఆయనకు మాటిచ్చారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన రూ.7 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం సినిమా నిర్మాతలు.. సిరాజ్‌కు తిరిగి డబ్బులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. లాభాల్లో వాటా ఇవ్వకపోగా.. తను పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వలేదని అన్నారు. సిరాజ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం మారాడు పోలీసులు ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాణ సంస్థలు అయిన పరావా ఫిల్మ్స్, షాన్ ఆంటోనీపై చీటింగ్ కేసును నమోదు చేశారు.

అగ్రిమెంట్ జరిగింది..

పరావా ఫిల్మ్స్‌లోని యాక్టివ్ ఇన్వెస్టర్లు.. సిరాజ్ వలియతరను ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి సంప్రదించారని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు. 2022లో నవంబర్ 30న ఈ విషయంపై పరావా ఫిల్మ్స్‌తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు సిరాజ్. అగ్రిమెంట్ ప్రకారమే ఆయన సినిమాలో రూ.7 కోట్ల పెట్టుబడిని పెట్టారు. అంతే కాకుండా మూవీలో ఇంతకు ముందే రూ.22 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగిందని సిరాజ్‌ను నిర్మాణ సంస్థ నమ్మించిందని ఆరోపించారు. ఇక థియేటర్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలిపి మొత్తంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’కు రూ.250 కోట్లు లాభాలు వచ్చాయి.

‘యానిమల్’కు కూడా..

ఇంతకు ముందుకు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాకు కూడా ఇదే విధంగా చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఫిబ్రవరీలో మలయాళంలో విడుదలయిన ఈ మూవీ ఓ రేంజ్‌లో హిట్ అయ్యింది. మలయాళంలో విడుదలయిన నెలరోజుల తర్వాత తెలుగులో రిలీజ్ అయినా కూడా దీనిని తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో చూడడానికి కూడా చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. ప్రస్తుతం తెలుగులో విడుదలయిన మలయాళ సినిమాల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ దక్కించుకుంది. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’లో శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ పరంబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు.

Also Read: నేరుగా ఓటీటీల్లోకి ‘మంకీ మ్యాన్’ - ఇక థియేటర్ రిలీజ్ లేనట్టేనా? స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

2024-04-24T15:35:17Z dg43tfdfdgfd