SAD STORY: పుట్టింటికి పుట్టినరోజు వేడుకలకు వచ్చి.. మృత్యుఒడిలోకి

ఆ కుటుంబంలో నెలకొన్న ఆనందాన్ని క్షణాల వ్యవధిలో విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు హరించింది. తమ తల్లి కళ్ల ముందే మృత్యువు ఒడికి చేరుకోవడంతో.. ముక్కు పచ్చలారని ఆ చిన్నారులు భోరున విలపించారు. ఈ విషాదకర ఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన పి. బాలాంజలి (25) కి నాలుగేళ్ల క్రితం పారుపల్లికి చెందిన భూపతి సురేష్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని లాలాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే తన పుట్టినరోజు కావడంతో బాలాంజలి, తన భర్త, పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. పుట్టినరోజు నాడు పుట్టింటికి కుమార్తె వచ్చిందని తల్లిదండ్రులు సంబరంగా ఉన్నారు.

మద్యాహ్నం సమయంలో దుస్తులు ఉతికేందుకు బాలాంజలి సిద్దం కాగా, అదే సమయంలో మోటార్ కు ఆనుకొని ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్ కు గురైంది. వెంటనే కుటుంబసభ్యులు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి తన్వి, ఆద్య అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పుట్టినరోజు జరుపుకొనేందుకు పుట్టింటికి వచ్చిన బాలాంజలి కరెంట్ షాక్ తో మృతి చెందడంపై ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా.. ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో.. గౌరాయిపల్లి గ్రామానికి చేరుకొని బాలాంజలి మృతదేహాన్ని సందర్శించారు. అలాగే కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఈ ఘటనపై తమ దృష్టికి ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. మెట్టినింటి నుండి పుట్టింటికి వచ్చిన సమయంలో మృత్యువు కబళించడంతో.. తమ తల్లిని పట్టుకొని ఆ చిన్నారులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది.

2024-07-02T10:12:36Z dg43tfdfdgfd