SHAKEEL NEWS: నా కొడుకును తెలంగాణ పోలీసులు చంపుతారట, సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందే - బోధన్ మాజీ ఎమ్మెల్యే

Bodhan Ex MLA Shakeel: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ చాలా కాలం తర్వాత ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమారుడు ఓ కారు ప్రమాదంలో ఇరుక్కోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షకీల్ ఇప్పుడు ఓ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోను ఆయన దుబాయ్ నుంచే చేసినట్లుగా తెలిసింది. తన కొడుకును జైల్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని షకీల్ అన్నారు. పోలీసులు కూడా నా కొడుకును చంపేస్తామని అంటున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో తన కొడుకును ఇరికించారని షకీల్ ఆవేదన చెందారు. పంజాగుట్ట కారు ప్రమాదం వ్యవహారంలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలుంటే మనం మనం చూసుకుందామని.. ఇందులోకి పిల్లలను లాగవద్దని సూచించారు. రాజకీయ శత్రుత్వంలోకి పిల్లలను జోక్యం చేయొద్దని సూచించారు.

తన కుమారుడు నిజంగా తప్పు చేసి ఉంటే.. అందుకు తగ్గ శిక్షలు ఉన్నాయని.. ఒకవేళ ఉరి వేసినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. అన్ని టీవీలు, పత్రికల్లో తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని.. తనకు పోలీసులపై అసలు నమ్మకం లేదని షకీల్ అన్నారు. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నానని.. దుబాయ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు.

తన 21 ఏళ్ల కుమారుడిని ఘటన జరిగిన తర్వాత అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. రోజాలో ఉన్న పిల్లాడ్ని 20 గంటల పాటు ఇన్వెస్టిగేషన్ చేశారని.. శారీరకంగా, మానసికంగా వేధించారని అన్నారు. అక్రమ కేసులు బనాయించి.. ఎన్ కౌంటర్ జరిపిస్తామని బెదిరిస్తున్నారని షకీల్ ఆరోపించారు. డీసీపీ వెస్ట్ జోన్, జూబ్లీహిల్స్ పోలీసులు, పంజాగుట్ట సీఐ తదితర పోలీసులు బాధ్యత వహించాలని అన్నారు.

షకీల్ కుమారుడు రహీల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. రహీల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలు, ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అతనికి సూచించింది.

2024-04-17T12:51:43Z dg43tfdfdgfd