SRI SRI: శ్రీశ్రీ.. రెండు అక్షరాల తుపాను.. పదపదమంటూ పరిగెత్తించే పదాల సునామీ

అది ఏప్రిల్ 30, 1910.. అంటే సరిగ్గా 114 ఏళ్ల క్రితం వైజాగ్‌లో ఓ తుపాను పుట్టింది. అయితే ఇది అలాంటి ఇలాంటి తుపాను కాదు.. అక్షరాల తుపాను.. నీరసించిన యువకుల నరనరాల్లో నెత్తురును మండించిన తుపాను.. భరతమాతను దాసీగా చేసిన తెల్లవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన తుపాను.. బానిస బతుకులకి తిరుగుబాటు నేర్పిన తుపాను.. దాని పేరే 'శ్రీశ్రీ'.

రెండు అక్షరాల ఈ పేరు లెక్కలేనంత మంది భావి రచయితల్లో స్ఫూర్పి నింపింది. మాకెవురున్నారులే అనుకునే దీన బతుకులకి ఆర్తి అయింది. ఇది ఆయన సంపాదించిన కీర్తి. అసలు "ఎముకలు కుళ్లిన వయసు మళ్లిన సోమరులారా చావండి.. నెత్తురు మండిన శక్తులు నిండిన సైనికులారా రారండి.."అంటూ శ్రీశ్రీ ఇచ్చిన పిలుపు ఓ విప్లవం.. ఆయన రాసిన మహాప్రస్థానం ఓ చరిత్ర. ఆయన రచనలు ఎప్పటికీ కావు అంతం.. ఆయన సాహిత్యం ఓ అనంతం.

"కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు

తాతగారి బామ్మగారి భావాలకి దాసులు

కానీ కొంతమంది యువకులు రాబోయే యుగపు ధూతలు

పావన నవజీవన బృందావన నిర్మాతలు"

నిప్పు రవ్వలు

శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కలం పట్టే సమయానికి తెలుగు సాహితీ ప్రపంచం ఓ మూసధోరణిలో సాగేది. సంప్రదాయ గ్రాంథిక శైలి, ఛందస్సులతో రాసే ఆ కవిత్వం పండితులకే తప్ప సామాన్యులకు అర్థమయ్యేది కాదు. అప్పుడే కవితకి కాదేది అనర్హం అంటూ ఓ నవయుగ విప్లవం సృష్టించాడు శ్రీశ్రీ. అల్ప పదాల్లో అనంతమైన అర్థం వచ్చేలా, ప్రాసలతో కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. 1950లో ఆయన రాసి మహాప్రస్థానం ఓ విప్లవమే సృష్టించింది. "ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వ కారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అంటూ శ్రీశ్రీ రాసిన మాటలు ప్రతి వారి మెదడులో తూటాల్లా పేలాయి. "మరో ప్రపంచ మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి" అంటూ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం చదువుతుంటే నరనరాల్లో నెత్తురు మరిగిపోయేది.. గుండెల్లో తెలియని జ్వాలాగ్ని రగిలేది. అసలు శ్రీశ్రీ కాగితం మీద కలం పెడుతుంటే జాలువారేవి కవితలు కాదు.. సమాజాన్ని కడిగేసే నిప్పు రవ్వలు అనిపించేది.

రూటే సెపరేటుశ్రీశ్రీ వాడే అక్షరాలు, పదాలు, ఛందస్సులు, అలంకారాలు అన్నీ అందరికీ తెలిసినవే. కానీ వాటిని వాడే విధానమే చాలా వైవిధ్యంగా ఉండేది. కృష్ణశాస్త్రి కవిత్వం అమ్మ పాడే జోల పాట అయితే శ్రీశ్రీ కవిత్వం సమాజాన్ని లాగి పీకే చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే శ్రీశ్రీ కవిత్వంలో ఓ బాధ, ఓ ఆక్రోశం, ఓ ఆవేశం, ఓ కష్టం, ఓ శ్రమ, ఓ వేదన, ఓ రోదన.. అనంతమైన ఆవేదన ఉండేది.

"యంత్ర భూతముల కోరలు తోముతూ కర్మాగారాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని అపార సంపద సృష్టించే కార్మిక చెమట బిందువుల శ్రమ శక్తిలో నుంచి పుట్టింది శ్రీశ్రీ కవిత్వం." శ్రీశ్రీ కవిత్వం ఓ అనంత బాధా సముద్రం.. శ్రీశ్రీ కవిత్వం ఓ అలుపెరుగని బాటసారి జీవితం. అందుకే ఆయన రూటు ఎప్పుడూ సెపరేటు.

తెలుగు వీర లేవరా

ఇక శ్రీశ్రీ సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఎన్నో సినిమాలకి మాటలు, పాటలు రాశారు శ్రీశ్రీ. అయితే శ్రీశ్రీ ఎన్ని పాటలు రాసినా అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన రాసిన "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా" అనే పాట మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే అల్లూరి పోరాటాన్ని మొత్తం ఒక్క పాటలో వివరించారు శ్రీశ్రీ.

ఇలా శ్రీశ్రీ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం ఒక అద్భుతమే. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నవి కాగితాలు కాదు మనందరి జీవితాలు. ఈనాడు తెలుగు సాహితీ లోకం మూడు కలాలు ఆరు కాగితాలుగా విరాజిల్లుతుందంటే అందులో శ్రీశ్రీ కృషి కూడా చాలా ఉంది. అంతెందుకు శ్రీశ్రీని గురువుగా చేసుకొని కలం పట్టి సినీరంగంలోకి దూకిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. అందుకే సాహితీ వినీలాకాశంలో ఆయనది ఓ చెరిగిపోని సంతకం. అంతం కానీ ఓ అక్షరాల అనంత సాగరం. శ్రీశ్రీ జయంతి సందర్భంగా సమయం తరఫున ఇదే మా అక్షర నివాళి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-30T07:32:17Z dg43tfdfdgfd