అయ్యయ్యో కంగనా.. సొంతపార్టీ అభ్యర్థి పైనే విమర్శలా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తున్న కంగనా నోరు జారీ నవ్వులపాలైంది. ప్రతిపక్ష నాయకుడిని విమర్శించబోయి సొంతపార్టీ నేతపైప తీవ్ర విమర్శలు చేశారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.
మే 5న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కంగనా రనౌత్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, బీజేపే నేత తేజస్వీ సూర్య(కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అభ్యర్థి) ఇద్దరి పేర్లు దాదాపు ఒకటిగా ఉండటంతో తేజస్వీ సూర్యపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని చూస్తే ..తేజస్వి సూర్య గుండాయిజం చేసి చేపలు తినే రకమంటూ ధ్వజమెత్తారు.
ఇటీవల తేజస్వి యాదవ్ చేపలు తింటున్న వీడియో లు వైరల్ కావడంతో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కంగనా వీడియోను షేర్ చేసిన తేజస్వి యాదవ్ ఆమె ఎవరంటూ సెటైర్ వేశారు. మండిలో కంగాన ప్రత్యర్థి విక్రమాదిత్య అయినప్పటికీ రాహుల్ నే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.
ఏడో విడతలో భాగంగా జూన్ 1న కంగనా రనౌత్ పోటీలో ఉన్న మండి నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.