గుడ్‌ న్యూస్‌ చెప్పిన పవన్‌ కళ్యాణ్‌.. సినిమా షూటింగ్‌లపై క్లారిటీ.. ఫ్యాన్స్ ఇక రిలాక్స్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి ఏపీ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఏపీలోని ఎన్డీయే కూటమీలో కీలకంగా ఉన్న పవన్‌ కి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే రంగంలోకి దిగారు పవన్‌. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నారు. 

జెట్‌ స్పీడ్‌లో పనులు అయ్యేలా చేస్తున్నారు. సినిమా స్టయిల్‌లో ఆయన పాలన చూపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. గెలిచిన రోజు నుంచి నిత్యం జనాల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నాడు. అయితే ప్రభుత్వ పదవిలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ నటించాల్సిన సినిమాల పరిస్థితేంటి? అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఆగిపోయినట్టే అనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సినిమాలు చేయడం కష్టం. రూల్స్ వ్యతిరేకమనే కామెంట్‌ కూడా ఉంది. పైగా ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. 

ఈ నేపథ్యంలో ఇక పవన్‌ చేయాల్సిన సినిమాల పని అంతే అనే టాక్‌ వచ్చింది. తాజాగా ఉప్పాడలో ఏర్పాటు చేసిన సభలో దీనిపై స్పందించారు పవన్‌. `ఓజీ ఓజీ ఓజీ` అంటూ ఫ్యాన్స్‌ అరుస్తుండటంతో వివరణ ఇచ్చాడు. సినిమాలు చేయడంపై ఆయన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. సినిమాలు చేస్తానని తెలిపారు. `మాటిచ్చాను కాబట్టి, కనీసం రోడ్లు అయినా వేయలేదని, గుంతలైనా పూడ్చలేదని మీరు తిట్టకూడదు కదా. కనీసం గ్రామాలకు కొత్త రోడ్ల కంటే ముందు గుంతలైనా పూర్చి, మళ్లీ మీరు తిట్టకూడదు కదా, ఏదో చేస్తావని ఎన్నుకుంటే నువ్వెళ్లి ఓజీ చేస్తున్నావేంటి క్యాజీ అంటే ఏం చెప్పను. అదే భయంతోటి.. మా నిర్మాతలకు కూడా చెప్పాను. కొంచెం క్షమించాలి. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కొంత సేవ చేసుకుని, కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు షూటింగ్‌ చేస్తానని చెప్పాను. ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దురుగానీ, బాగుంటుంది` అని వెల్లడించారు పవన్‌. దీంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. లేట్‌ అయినా సినిమాలు చేయనున్నట్టు పవన్‌ వెల్లడించడంతో ఫ్యాన్స్ రిలాక్స్ కావడమే కాదు, నిర్మాతలకు కూడా ఇది బిగ్‌ రిలీఫ్‌ నిచ్చే అంశమని చెప్పొచ్చు. 

ఇక ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. సుజీత్‌ దర్శకత్వంలో `ఓజీ` చేస్తున్నాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, ఏఎం రత్నం `హరిహర వీరమల్లు` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణ కొంత వరకు జరిగాయి. ఏపీలో ఎన్నికలు రావడంతో ఆపేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా `ఓజీ` సినిమా గురించి చెబుతూ, సినిమా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అని ఆయన చెప్పడం విశేషం. అలాగే మొదట పవన్‌ `హరిహర వీరమల్లు` షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్ ఉందట. 

2024-07-03T14:44:06Z dg43tfdfdgfd