నిర్మాత నాగవంశీకి లాభాల పంట పండుతుంది. `టిల్లు స్వ్కేర్`తో ఆయన మూడు రెట్లు లాభాలను పొందారు. తమ మ్యానర్లలో వచ్చిన `గుంటూరు కారం`, `ఆది కేశవ` చిత్రాలు ఘోర పరాజయం చెందడంతో ఆ నష్టాలను `టిల్లు స్వ్కేర్` భర్తీ చేసిందని చెప్పొచ్చు. ఈ సక్సెస్ జోరులో ఉన్న నిర్మాత నాగవంశీ ఇప్పుడు మరో సక్సెస్ ఫుల్ మూవీకి సీక్వెల్ని ప్రకటించారు. `టిల్లు` సెంటిమెంట్ని ఫాలో అవుతూ `మ్యాడ్ స్వ్కేర్`ని ప్రారంభించారు. పిచ్చిని డబుల్ చేయబోతున్నారు.
గతేడాది వచ్చిన `మ్యాడ్` మూవీ మంచి విజయాన్ని సాధించింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా నిలిచింది. తాజాగా దీనికి సీక్వెల్ని ప్రకటించారు. అయితే ఈ మూవీకి టైటిల్ని టిల్లు సెంటిమెంట్ని ఫాలో కావడం విశేషం. `మ్యాడ్ స్వ్కేర్` అని వెల్లడించారు. ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా `మ్యాడ్ స్వ్కేర్` ని చిత్ర బృందం ప్రైవేట్ సెర్మనీగా ప్రారంభించారు. తాజాగా శుక్రవారం దీన్ని అనౌన్స్ చేశారు. `మ్యాడ్` కాలేజ్,హాస్టల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కి హిలేరియస్ ఎంటర్టైనర్గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్తో రూపొంది పెద్ద హిట్ అయ్యింది.
ఇప్పుడు `మ్యాడ్2`ని సేమ్ కాంబినేషన్లో అదే దర్శకుడితో సినిమాని రూపొందిస్తున్నారు. ఇక దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే వీళ్లకి జోడీగా ఆ అమ్మాయిలే నటిస్తారా? మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది యూనిట్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ మూవీ గురించి టీమ్ మాట్లాడుతూ, యంగ్ హీరోహీరోయిన్లతో 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్'ని రూపొందిస్తున్నాం. `మ్యాడ్` ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నాం. 'మ్యాడ్ నెస్' ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించాం. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం` అని తెలిపింది.
'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె, ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతంలో వారి చేతుల మీదుగా ప్రారంభమైన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్' చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. 'మ్యాడ్ స్క్వేర్' సినిమాకి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగి, ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
2024-04-19T13:45:37Z dg43tfdfdgfd