పెట్ లవర్స్‌ ఈ పని కచ్చితంగా చెయ్యాల్సిందే..! అదేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి

కాలం వేగంగా పరుగెడుతోంది. మారిన జీవన విధానం, ఉద్యోగాలు, వ్యాపారాలతో అందరూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది మనుషుల కంటే జంతువులతో ఎక్కువగా కలిసిపోతున్నారు. కాలక్షేపంతో పాటు మానసిక ప్రశాంతత కోసం జంతువులను పెంచుతున్నారు. కొత్తగా పెంపుడు జంతువులకు దగ్గరయ్యేవారు కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ క్రమంలో పెట్‌ లవర్స్‌ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి యజమానులు సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం సైతం పలు కార్యక్రమాలు చేపడుతోంది.

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జులై 6వ తేదీన పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేయనున్నారు. ఈ మేరకు పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్‌ ఆర్.అమరేంద్ర కుమార్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పశువైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పోలి క్లినిక్‌లలో, వెటర్నరీ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్ వద్ద ఉచితంగా టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 70 వేల యాంటీ రేబీస్ టీకాలు సిద్ధం చేశామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1962ను లేదా దగ్గర్లోని పశువైద్యశాలలో గానీ, సమీప రైతుసేవా కేంద్రంలో గానీ సంప్రదించాలని పశువుల పెంపకం దారులకు, రైతులకు, ప్రజలకు, పశు వైద్యులకు సూచించారు.

జూనోసిస్ డే ప్రత్యేకత ఇదే...

మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. వీటి ఆధారంగా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ కుక్కకాటు బారినపడిన ఒక పిల్లవాడికి టీకా మందు ఇచ్చి బతికించిన రోజే జూలై 6వ తేదీ. ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. సుమారు 180 రకాలకు పైబడిన వ్యాధులు పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయి. ఈ జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి, వాటి బారిన పడకుండా చేయడమే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.

పశుపక్ష్యాదులతో మెలిగే పశువైద్యులు, రైతులు, వధశాల కార్మికులు, పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండేవారికి ఎక్కువగా ఈ జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రధానంగా వీరికి రేబిస్, ఆంత్రాక్స్, బ్రుసుల్లోసిస్, క్షయ మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో రేబిస్ చాలా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, పశువులు, పెంపుడు జంతువులను పెంచేవారు అవగాహన పెంచుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

2024-07-03T09:43:22Z dg43tfdfdgfd