భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు

భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు

  • హీరో దగ్గుబాటి వెంకటేశ్​
  • కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్​ షో

ఖమ్మం, వెలుగు: సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్​మంగళవారం ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా నగరంలో రోడ్​ షో నిర్వహించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ ​అభ్యర్థి రఘురాంరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఖమ్మం కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్​ మీదుగా ఇల్లందు క్రాస్ ​రోడ్​ వరకు రోడ్​ షో సాగింది.

జడ్పీసెంటర్​లో వెంకటేశ్ మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఈవీఎంలో మూడో నంబర్​ సీరియల్​లో హస్తం పక్కన బటన్ ​నొక్కాలని కోరారు. ఎనీ సెంటర్..​ సింగిల్​ హ్యాండ్..​ రఘురాంరెడ్డి అంటూ గణేశ్ సినిమా డైలాగ్ చెప్పడంతో జనాలు చప్పట్లు కొట్టారు. ప్రతి ఒక్కరూ ఓటెయ్యాలని, అది హక్కు మాత్రమే కాదు అందరి బాధ్యత అని వెంకటేశ్​చెప్పారు. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు అంటూ అందరినీ ఉత్సాహపరిచారు.

అక్కా, తమ్ముడూ, తాతా అంటూ పలకరించారు. అంతకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడారు. రోడ్​ షోకు భారీగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ​కార్యకర్తలతో పాటు వెంకటేశ్ ​అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో వైరా మెయిన్​ రోడ్​పై ట్రాఫిక్​ను పోలీసులు దారి మళ్లించారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నేతలు తుమ్మల యుగంధర్, కమర్తపు మురళి పాల్గొన్నారు.అలాగే కొత్తగూడెంలో రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా వెంకటేశ్​ పాల్గొని మాట్లాడారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T04:07:22Z dg43tfdfdgfd