రాజమౌళి.. `బాహుబలి` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు, తెలుగు అని చూపించాడు. సినిమా లెక్కలు మార్చేశాడు. ఎవరూ చేయని సాహసం చేసి సక్సెస్ అయ్యాడు. సినిమాలకు బడ్జెట్ గేట్ల ఎత్తేసేలా చేశాడు. మార్కెట్ పరిధిని పెంచాడు. లార్జర్ దెన్ లైఫ్ అనేలా సినిమా స్థాయినే పెంచేశాడు. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారనంటే దానికి ఆయనే కారణమని చెప్పొచ్చు.
చివరగా `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని తెరకెక్కించారు జక్కన్న. ఈ మూవీ రెండేళ్ల క్రితం విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. సుమారు 1200కోట్లు వసూలు చేసింది. కానీ నిర్మాత హ్యాపీ కాదని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలను సమానంగా చూపించలేదని, రామ్ చరణ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఎన్టీఆర్ని తొక్కేశారని, ఆయన్ని సపోర్టింగ్ క్యారెక్టర్గా మార్చారని వారి అభిమానులు, సాధారణ ఆడియెన్స్ కూడా అన్నారు. అప్పట్నుంచి దీనికి సంబంధించిన ట్రోల్స్ జరుగుతూనే ఉంది.
`ఆర్ఆర్ఆర్` తర్వాత రాజమౌళి మీడియా ఇంటరాక్షన్ ఎప్పుడూ జరగలేదు. రెండేళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. అడపాదడపా ఈవెంట్లలోనే కనిపించే ఆయన తాజాగా `బాహుబలి` యానిమేషన్ ఫిల్మ్ కోసం వచ్చారు. యానిమేషన్ మూవీని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. సిరీస్ మాదిరిగా దీన్ని ప్రసారం చేయబోతున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా కోసం రెండు ఎపిసోడ్లని ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాజమౌళికి షాకిచ్చే ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా యానిమేషన్ చేసిన `బాహుబలి` సినిమాని చెడగొట్టినట్టు అనిపించలేదా అని అడగ్గా, ఆడియెన్స్ నుంచి స్పందన బాగా వస్తుందని ఆశిస్తున్నామని, బాగానే చేశారని తెలిపారు. తాము చెడగొట్టామని భావించడం లేదన్నారు. ఈ సందర్భంగా `ఆర్ఆర్ఆర్` ప్రశ్న ఎదురయ్యింది. `ఆర్ఆర్ఆర్`లో ఒక హీరోని ఎక్కువ, మరో హీరోని తక్కువ చేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా, రాజమౌళి తప్పించుకున్నాడు. దానికి సమాధానం చెప్పడానికి ఇది సందర్భం కాదు, సమయం కాదు, వేదిక కాదు అని వెల్లడిస్తూ దాన్ని దాటవేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2024-05-07T13:59:55Z dg43tfdfdgfd