సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ల చోరీ
హైదరాబాద్/హాలియా, వెలుగు: తాగునీటి కోసమని కుడి కాల్వ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ.. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి దొంగచాటుగా జలాలను తరలించుకుపోతున్నది. సాగర్ ప్రాజెక్టుకు దిగువన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి సమీపంలోని చిట్యాల దగ్గర నిర్మించిన టెయిల్పాండ్ నుంచి ఏపీ అధికారులు నాలుగు టీఎంసీల నీళ్లను విడుదల చేసుకున్నారు.
4 రోజులుగా టెయిల్పాండ్ నుంచి పులిచింతల ప్రాజెక్ట్కు వాటర్ను రిలీజ్ చేసుకుని.. ఏపీ అవసరాల కోసం వాడుకుంటున్నారు. తాగునీటి కోసం ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. 500 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు అవకాశం ఇచ్చిన త్రిసభ్య కమిటీ.. తెలంగాణకు 8.695 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల జలాలను కేటాయించింది. అయితే, ఇప్పటికే ఏపీ మూడు విడతలుగా నీటిని విడుదల చేసుకుంది.
అది చాలదన్నట్టు టెయిల్పాండ్ నుంచి సాగర్లోకి టర్బైన్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేయాల్సిన నీటిని ఏపీ దొంగ చాటుగా ఎత్తుకెళ్లిపోయింది. సాగర్ నుంచి విద్యుదుత్పత్తి చేసుకున్నాక దిగువకు వెళ్లే నీటిని స్టోర్ చేసేందుకు చిట్యాల దగ్గర టెయిల్పాండ్ను నిర్మించారు. వాటిని మళ్లీ దిగువకు పంపించకుండా సాగర్లోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏపీ ఆ నీటిని వాడేసుకోవడంతో పాండ్ లో బండరాళ్లు, ఇసుక తేలాయి. ఏపీ తోడేసుకున్న నీళ్లు పోను ప్రస్తుతం టెయిల్ పాండ్లో మరో 2.9 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తున్నది. నీటిని దొంగచాటుగా ఏపీ తరలించుకుపోయిన సంగతి తెలిసి.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అధికారులు గురువారం టెయిల్పాండ్ను పరిశీలించారు. జలాశయంలో నీరు తగ్గిపోవడంతో మిషన్ భగీరథకు అందించాల్సిన నీటి కోసం అక్కడ ఏర్పాటు చేసిన అదనపు మోటార్లను నదిలోకి దింపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-20T01:16:00Z dg43tfdfdgfd