నైనీ బొగ్గు బ్లాక్కు ఏనుగుల గండం!
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి ఎనిమిదిన్నరేండ్ల కింద ఒడిశా రాష్ట్రంలో దక్కించుకున్న నైనీ కోల్ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏటా 10 మిలియన్ టన్నుల ప్రొడక్షన్పై ఆశలు పెట్టుకున్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా నైనీ బ్లాక్ గని ప్రారంభానికి ఎలిఫెంట్ కారిడార్ రూపంలో గండం వచ్చిపడింది. ఏనుగులు తిరుగాడే ప్రాంతం కావడం వల్ల ఒడిశా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. దీంతో మూడేండ్లుగా ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయిస్తున్నా, తట్టెడు బొగ్గు బయటకురాని పరిస్థితి ఉంది.
350 మిలియన్ టన్నుల నిక్షేపాలు
ఒడిశా రాష్ట్రంలోని మహానది కోల్ఫీల్డ్ పరిధిలో నైనీ కోల్ బ్లాక్ను ఆగస్టు 13, 2015లో కేంద్రం ద్వారా సింగరేణి దక్కించుకుంది. సుమారు 913 హెక్టార్లలో బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉండగా, 783 హెక్టార్ల భూమి ఫారెస్ట్లో ఉంది. సుమారు 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో 350 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.58 క్యూబిక్ మీటర్ల మట్టి(ఓబీ) తొలగిస్తే సరిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని సింగరేణి ఓసీపీల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి వస్తోంది.
నైనీ బ్లాక్లో 20 నుంచి 30 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలుండటంతో ఖర్చు తగ్గి, సింగరేణికి భారీ లాభాలు వస్తాయనే అంచనా ఉంది. జీ10 గ్రేడ్ క్వాలిటీ బొగ్గును ఏటా 10 మిలియన్ టన్నుల చొప్పున 38 ఏండ్ల పాటు ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా సుమారు 3200 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ఏర్పాటుకు 2021, జనవరి 20 పబ్లిక్ హియరింగ్లో స్థానికులు ఓకే చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు సప్లై చేయనున్నారు.
ఎలిఫెంట్ కారిడార్ పేరుతో అడ్డంకులు..
నైనీ బ్లాక్ స్టేజ్-–1కి 2021లో కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ అనుమతులు మంజూరు చేసింది. తర్వాత స్టేజ్–-2 అనుమతి కోసం సింగరేణి ఒడిశా ప్రభుత్వానికి ఫైల్ పంపింది. పర్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఒడిశా సర్కారు ఏనుగుల కారిడార్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. నైనీ బ్లాక్కు 25 కిలోమీటర్ల రేడియస్లోని దట్టమైన అడవుల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని, నైని గనిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా కారణంగా ఏనుగుల మనుగడ ప్రమాదంలో పడ్తుందని, గ్రామాలు ధ్వంసమై గిరిజన ఆవాసాలు దెబ్బతింటాయని ఫారెస్ట్ పర్మిషన్లు ఇవ్వకుండా అక్కడి సర్కార్ కొర్రీలు పెడుతోంది.
వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పాలని కోరింది. దీంతో అటవీశాఖ సూచించిన అన్ని నిబంధనలు పాటిస్తామన్న సింగరేణి యాజమాన్యం, ప్రత్యామ్నాయ అటవీ భూమిని సైతం సమకూర్చింది. ఎలిఫెంట్-హ్యుమన్ కాంప్లిక్ట్, నివారణ చర్యలపై ప్రత్యేకంగా నివేదిక రూపొందించి 2023 నవంబర్లో ఒడిశా సర్కారుకు అందజేసింది. ఇది జరిగి ఐదు నెలలు దాటినా అక్కడి సర్కార్ నుంచి స్పందన రాలేదు. ఈ క్రమంలో అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపడంతో నాటి సీఎండీ చొరవ చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి.
కోట్లలో ఖర్చు..
నైనీబ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ఇప్పటికే వందల కోట్లు వెచ్చించింది. నైని బ్లాక్ నుంచి ప్రధాన రైల్వే మార్గానికి అనుసంధానం చేసేందుకు 68 కిలోమీటర్ల మేర ట్రైన్ ట్రాక్ నిర్మాణపనులు జరుగుతుండడంతో ఏకంగా రూ.1,700 కోట్లు కేటాయించింది. రూ.2 కోట్లతో అనలిటికల్ సెంటర్ నిర్మించింది. ఆర్అండ్ఆర్ కోసం రూ.115 కోట్లు కేటాయించింది. సర్వేలు, ప్రభావిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, ఒడిశా తుపాను బాధితులకు సాయం పేరిట వందల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు తట్టెడు బొగ్గు ఉత్పత్తి చేయకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల హడావిడి నేపథ్యంలో జూన్ వరకు నైని బ్లాక్కు స్టేజ్–-2 పర్మిషన్లలో కదలిక వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఈ క్రమంలో ఓ బృందాన్ని ఒడిశాకు పంపించేందుకు ప్రస్తుత సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
©️ VIL Media Pvt Ltd. 2024-04-17T04:29:26Z dg43tfdfdgfd