అమానుషం.. భర్తతో గొడవపడి మూగ బిడ్డను మొసళ్లున్న నదిలోకి విసిరేసింది

భర్తతో గొడవపడిన ఓ మహిళ.. ఆయనపై కోపంతో మూగవాడైన తన ఆరేళ్ల కుమారుడ్ని మొసళ్లు తిరిగే నదిలోకి విసిరేసింది. చివరకు ఒంటి నిండా గాయాలు, ఓ చేయిలేని స్థితిలో ఆ బాలుడి మృతదేహం లభ్యమైంది. అత్యంత అమానవీయ ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలీ తాలుకాకు చెందిన సావిత్రి, రవికుమార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు వినోద్ (6) పుట్టు మూగవాడు కావడంతో.. ఆ చిన్నారి గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలాంటి బిడ్డను ఎందుకు కన్నావు..? వాడిని దూరంగా విసిరేయమని భార్యను వేధింపులకు గురిచేశాడు.

ఇదే విషయమై, శనివారం సాయంత్రం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో విసుగెత్తిపోయిన ఆమె కఠినంగా వ్యవహరించింది. ఆ బాలుడ్ని తీసుకెళ్లి మొసళ్లు ఎక్కువగా సంచరించే కాళీ నదిలో కలిసే మురికి కాల్వలోకి విసిరేసింది. దీనిని గమనించి స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. స్థానికులు, ఈతాగాళ్ల సాయంతో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.

రాత్రి పొద్దుపోవడంతో రెస్క్యూ నిలిపివేశారు. తిరిగి ఆదివారం ఉదయం గాలించగా ఆ చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఒళ్లంతా తీవ్ర గాయాలు, ఒక చేయి లేకపోవడంతో.. మొసలి దాడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, భార్యభర్తలిద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T05:55:56Z dg43tfdfdgfd