తెలుగు సినిమాలో ఫస్ట్ టైమ్‌ హిందీ పాట.. పవన్‌ కళ్యాణ్‌ సాహసం.. `ఖుషి` తెరవెనుక కథ..

`ఖుషి` సినిమా ఇరవై ఏళ్ల క్రితం యూత్‌ని ఉర్రూతలూగించిన మూవీ. బాగా ప్రభావితం చేసిన మూవీ కూడా. అందులో పవన్‌ ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉందట. అందులో హిందీ పాటవెనుక స్టోరీ ఉందట. 

 

తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇంగ్లీష్‌ పదాలు యాడ్‌ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ట్రెండ్‌ నడుస్తుంది. అడపాదడపా హిందీ లిరిక్‌ కూడా కనిపిస్తుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇరవై ఏళ్ల క్రితమే ఆ సాహసం చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. మరి పవన్‌ ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ సమయంలో ఏం జరిగిందనేది చూస్తే, 

 

పవన్‌ కళ్యాణ్‌కి సామాజిక స్పృహ ఎక్కువ. తన సినిమాల్లో ఏదొ ఒక సందేశం ఇవ్వాలని, జనాన్ని అవేర్‌నెస్‌ క్రియేట్‌ చేసే పాయింట్‌ పెట్టాలని కోరుకుంటారని, అలా తన ప్రతి సినిమాలో ఇలాంటి ఏదో ఒక సందేశం ఉంటుంది. పాటల రూపంలో యూత్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం వారిలో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తుంటారు పవన్‌. ఇదే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. పవన్‌ తో ఆయన `ఖుషి` సినిమా నిర్మించారు. 

 

ఈ సందర్భంగా `ఖుషి`లో పవన్‌ చేసిన సాహసం, తెరవెనుక జరిగిన కథ చెప్పారు రత్నం. తెలుగు సినిమాల్లో హిందీ పాట పెట్టడం అప్పటి వరకు జరగలేదు. అందులో ` ఏ మేరా జహా` అనే పాట పెట్టాలనే ఐడియా పవన్‌ కళ్యాణ్‌ దే అని తెలిపారు రత్నం. సినిమాలో సిద్దు కోల్‌కత్తా పుట్టి పెరుగుతాడు. హిందీ తెలిసిన వాడు. కాబట్టి హిందీ పాట పెడితే బాగుంటుందని చెప్పాడట పవన్‌. మొదట నో చెప్పినా, తర్వాత పెట్టించాడట. దాని కోసం ఓ హిందీ రైటర్‌ని పట్టుకుని పవన్‌ చెప్పినట్టుగానే ఓ గంటలో ఆ లిరిక్‌ రాశారట.  

 

అలా `ఖుషి`లో మొదటిసారి హిందీ పాట పెట్టామని, అది సంచలనాత్మకంగా నిలిచిందని, అప్పట్లోయూత్‌ని ఊపేసిందని చెప్పారు రత్నం.  అంతేకాదు పాటలో లిరిక్‌ కూడా పవన్‌ సలహాలే అని, ఇది మా దేశం, మా ప్రాంతం మీకు ఇక్కడ పనేంట్రా అని చెప్పే పదాలు, అలాగే రాజకీయ నాయకులు డబ్బుల కోసం భారతమాతని కూడా అమ్మేసుకుంటారని అందులో చెప్పారని, నిజానికి `ఖుషి` లవ్‌ స్టోరీ. అందులో ఇలాంటి సందేశం సెట్‌ కాదు, కానీ పవన్‌ ఒత్తిడి చేసి పెట్టించాడు, అదే హైలైట్ గా నిలిచింది. అంతేకాదు ఆ పాట పెట్టడం వెనుక మరో కారణం ఉంది.

 `ఖుషి` సినిమాని హిందీలో డబ్‌ చేసిరిలీజ్‌ చేయాలని పవన్‌ అన్నాడట. కానీ మనకు మార్కెట్‌ లేదని, చూడరని చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడట. అలా డబ్‌ చేస్తే, హిందీ ఆడియెన్స్ కి ఆ పాట బాగా కనెక్ట్ అవుతుందనేది పవన్‌ ఉద్దేశ్యమన్నారు రత్నం. క్లైమాక్స్ లో సిద్దు సిద్ధార్థ్‌ రాయ్‌ అని చెబుతూ దేశ నాయకుల పేర్లు కూడా చెప్పడమనేది పవన్‌ ఆలోచనే అని వెల్లడించారు రత్నం. పవన్‌ ఎప్పుడూ సామాజికంగా చాలా కాన్షియస్‌గా ఉంటాడని చెప్పారు. 

 

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత రత్నం ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం పవన్‌తో ఆయన `హరిహర వీరమల్లు` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని రీ స్టార్ట్ చేయబోతున్నారట. అక్టోబర్‌, డిసెంబర్‌లోగానీ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పారు. 2001లో వచ్చిన `ఖుషి`లో పవన్‌కి జోడీగా భూమిక హీరోయిన్‌గా నటించగా, ఎస్‌ జే సూర్య దర్శకత్వం వహించారు. అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా ఈ మూవీ నిలవడం విశేషం. 

2024-06-29T11:12:51Z dg43tfdfdgfd