మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన చేయగా, ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాను ఏకంగా రూ. 1000 కోట్లతో తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

అల్యుమినియం ఫ్యాక్టరీ భూమిని లీజ్ కు తీసుకున్న రాజమౌళి

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా సెట్స్ నిర్మిస్తున్నారట. రాజమౌళి సినిమా అనగానే విజువల్ వండర్ గా ఉంటుంది. ఈ సినిమాలోనూ కనీవినీ ఎరుగని సీన్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీ భూమిని లీజుకు తీసుకున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి 9 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారట. ఇందులో 4 ఎకరాల్లో ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. హైదరాబాద్ లోనే అత్యంత సువిశాల ప్రాంతం కావడం, ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడ చాలా సినిమాలను షూట్ చేస్తారు. ఇప్పుడు జక్కన్న కూడా అక్కడే సెట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాపులు కూడా అక్కడే నిర్వహించాలని భావిస్తున్నారు.  

‘RRR’ షూటింగ్ కూడా ఇక్కడే..

నిజానికి ‘RRR’ సినిమాకు సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్స్ వేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి కొంత భాగాన్ని లీజుకు తీసుకుని ఈ సెట్స్ నిర్మించారు. ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా అక్కడే సెట్స్ వేస్తున్నారు. గత కొద్ది రోజులు ఇక్కడే ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనూ ఈ సెట్స్ నిర్మాణం కూడా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ పనులు పూర్తిగానే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రపంచంలోని పలు దేశాల్లో నిర్వహించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

విజయేంద్ర ప్రసాద్ కథ, కీరవాణి సంగీతం

మహేష్ బాబు సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనే విషయానికి సంబంధించి ఆయన ఇప్పటికే కీలక అప్ డేట్స్ ఇచ్చారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ ను రెడీ చేసుకున్నారట రాజమౌళి.

Read Also: ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్ లో ‘యానిమల్’ బ్యూటీ రియాక్షన్ - ‘నేషనల్ క్రష్’ కామెంట్స్ పై ఏం చెప్పిందో తెలుసా?

2024-07-01T09:55:56Z dg43tfdfdgfd