GUPPEDANTHA MANASU TODAY జూన్ 29 ఎపిసోడ్: రంగాని ఘోరంగా అవమానించిన సరోజ తండ్రి.. మామకి ఇచ్చిపడేసిన అల్లుడు

Guppedantha Manasu June 29 Today Episode: సరోజకి రంగా అంటే పిచ్చి ఇష్టం. ఎప్పుడెప్పుడు బావ చేతిలతో తాళి కట్టించుకుని అత్తింట్లో అడుగుపెట్టేద్దామా అని తహతహలాడుతుంది సరోజ. అయితే సరోజకి బావ పిచ్చి అయితే.. ఆమె తండ్రి సంజీవయ్యకి డబ్బు పిచ్చి. ఆ పిచ్చితోనే నేటి ఎపిసోడ్‌లో రంగాని ఘోరంగా అవమానించాడు. 

రంగాపై ఇష్టాన్ని పెంచుకుంటున్న సరోజకి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది వసుధార. రంగానే రిషి అని.. ఆల్రెడీ అతనికి తనతో పెళ్లి అయ్యిందని.. అందుకే నిన్ను దూరం పెడుతున్నాడని రంగాని ఇరుకున పెడుతుంది. అయితే అలాంటిదేం లేదని రంగా మెల్లగా జారుకుంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ఎండీ సీటు విషయంలో శైలేంద్ర ఇంట్లో డిస్కషన్ నడుస్తుంది. వసుధార తిరిగి వచ్చినా.. శైలేంద్రని ఎండీని చేయడానికి ఒప్పుకోదని అంటుంది ధరణి. ఏ అర్హత లేని నా భర్త శైలేంద్రని కాలేజ్‌కి ఎండీని చేస్తే.. స్టూడెంట్స్ భవిష్యత్ నాశనం అయిపోతుంది. కాలేజ్ పతనమైపోతుంది అని అంటుంది ధరణి.. ఇప్పుడేదో అగ్రభాగాన ఉండి... ఒకటీ.. ఒకటీ.. రెండూ.. రెండూ అంటూ ర్యాంక్‌లు కురిపిస్తున్నట్టుగా. ఆల్రెడీ వసుధార ఎండీ అయ్యింది మొదలు అప్పటి నుంచి డీబీఎస్టీ కాలేజ్ పతనం అవుతూనే వస్తోంది. కనీసం ఎగ్జామినేషన్ సెంటర్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది కాలేజ్. కానీ.. శైలేంద్రని మాత్రం ఏమీ చేతకాని వాడంటూ.. ఎప్పటిలాగే తక్కువ చేసి మాట్లాడుతుంది ధరణి. ఇక ఫణీంద్ర కూడా.. శైలేంద్రని ఎప్పటిలాగే కించపరుస్తూ మాట్లాడతాడు. మీ అమ్మని అడుక్కుని ఎండీ అవ్వాలని చూడటం కాదు.. నీ సొంత తెలివితేటలతో ఎండీ అవ్వాలని కోరుకో బాగుపడతావ్ అని చురకలు వేస్తాడు. వడ్డీ డబ్బుల్ని లెక్కేస్తున్న రంగా.. సరోజ తండ్రే వడ్డీ వ్యాపారి

మరోవైపు నేటి ఎపిసోడ్‌లో మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అతనే సరోజ తండ్రి . తన మామకి ఇవ్వాల్సిన వడ్డీ డబ్బుల్ని లెక్కపెడుతూ ఉంటాడు రంగా. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా.. వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మామ ఊరుకోడు కదా.. అందుకే అతను వచ్చేసరికి డబ్బుల్ని లెక్కపెట్టి ఉంచుతున్నా అని రాధమ్మతో చెప్తాడు రంగా. దాంతో రాధమ్మ.. ‘ఏమోరా.. ఆ సరోజ ఏమో నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది.. వాళ్ల నాన్న ఏమో.. వడ్డీ డబ్బుల కోసం పీక్కుని తింటున్నాడు. మీ ఇద్దరికీ ఎలా కుదుతుందో ఏంటో అని అంటుంది. ఇంతలోనే వడ్డీ డబ్బుల్ని వసూలు చేయడం కోసం వచ్చేస్తాడు సరోజ తండ్రి సంజీవయ్య.

ఇతనే సరోజ తండ్రి సంజీవయ్యా.. ఎకసెకలు మామూలుగా లేవుగా

రండి మామయ్యా.. రండి.. అని రంగా కుర్చీ వేస్తాడు. దాంతో సంజీవయ్య.. ‘మర్యాదలు వద్దులేరా.. డబ్బులిస్తే చాలు’ అంటూ వెటకారం చేస్తాడు. ఇక వడ్డీ డబ్బుల్ని తీసుకుని పదే పది సార్లు లెక్కపెడుతూ ఉంటాడు సంజీవయ్య. జీవితాంతం ఇలా వడ్డీలు కడుతూనే ఉంటావేంట్రా రంగా.. అసలు ఇచ్చేది ఏమైనా ఉందా? అని అంటాడు సంజీవయ్య. ఇస్తాను మామయ్యా.. ఇస్తాను.. మొత్తం ఇచ్చేస్తాను మామా అని అంటాడు రంగా. హా తీర్చావ్ లే అని వెటకారంగా నవ్వుతాడు సంజీవయ్య. ఇంతలో రాధమ్మ వచ్చి.. సరోజ పెళ్లి గురించి మాట్లాడుతుంది. మా రంగాని ఇష్టపడుతుంది.. వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని అంటుంది.

ఏంటీ నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేయాలా?? రంగాని అవమానించిన మామ

దాంతో సంజీవయ్య.. ఎవరికి బాగుంటుందీ.. మీకా నాకా?? నా కూతురు ఇష్టపడుతుందా?? అది వయసులో ఉంది.. సినిమా హీరోలను సీరియల్ హీరోలను ఇష్టపడుతుంది.. అలాగని ఎవడికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామా? ఏంటీ.. అయినా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఈడికి ఏం అర్హత ఉంది? ఈ పెళ్లితో నాకు లాభం ఏంటీ.. అసలు వీడి దగ్గర ఏముందని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి? పెళ్లి వంకపెట్టి డబ్బులు ఎగ్గొట్టేద్దాం అని ప్లాన్ వేశారా ఏంటీ.. అని అవమానిస్తూ మాట్లాడతాడు సంజీవయ్య.

నా కాళ్లు కడిగి కన్యాదానం చేసినా మీ కూతుర్ని పెళ్లి చేసుకోను మామా..

దాంతో రంగా.. ‘నేనేం అలా అనుకోలేదు మామా.. నీ డబ్బుల్ని ఇచ్చే తీరతా.. ఊరికే అపార్ధం చేసుకోకు’ అని అంటాడు రంగా. ‘అబ్బో రోషం పొడచుకొచ్చిందే.. నువ్వు చెప్పకుండా మీ నాన్నమ్మ ఈ పెళ్లి గురించి మాట్లాడుతుందా? అని అంటాడు సంజీవయ్య. ‘ఆవిడ మంచితనం కొద్దీ ఆ మాట చెప్పింది.. కానీ నా మాట వినండి.. మీ అంతట మీరు.. నా కాళ్లు కడిగి కన్యాదానం చేస్తానన్నా కానీ.. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోను.. అందుకు సిద్దంగా కూడా లేను’ అని అంటాడు రంగా. దాంతో అబ్బో.. మగాడివే.. ఇదే మాట మీద ఉండ్రా అబ్బాయ్ అని అంటాడు సంజీవయ్య.

నీకే దిక్కులేదు.. మళ్లీ మీతో ఈ పిల్లా.. బాగుంద్రా అబ్బాయ్

ఇంతలో మన హీరోయిన్ వసుధార ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి సంజీవయ్యా.. ‘ఈ పిల్ల ఎవరూ?? ఓ.. నువ్వు కాపాడి తీసుకొచ్చింది ఈ పిల్లనేనా?? సరోజ చెప్పిందిలే.. తాను దూరడానికి సందు లేదు కానీ.. మెడకి డోలు కట్టుకున్నట్టు.. మీకు తినడానికి దిక్కులేదు కానీ.. మళ్లీ ఈ పిల్లను తీసుకొచ్చావా? సరేలే మీ ఏడుపు మీరు ఏడండి’ అంటూ దారుణంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోతాడు సంజీవయ్య. దాంతో రంగా.. ‘నానమ్మా.. ఎందుకు పెళ్లి మ్యాటర్ తెచ్చావ్’ అంటూ రాధమ్మపై ఫైర్ అవుతాడు. వసుధార.. రంగాని అలా చూస్తూ ఉండిపోతుంది. మొత్తానికి రంగాకి అయితే సరోజని వదిలించుకోవడానికి సంజీవయ్య రూపంలో మంచి అవకాశం దొరకడంతో.. ఒక్క మాటతో మరదల్ని దూరం పెట్టేశాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-29T05:20:36Z dg43tfdfdgfd