CRIME NEWS: అమ్మాయి విషయంలో వివాదం - స్నేహితుడిని దారుణంగా చంపేసిన విద్యార్థులు, ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

Minors Murdered His Friend In Hyderabad: ఓ అమ్మాయితో ప్రేమ విషయంలో ఏర్పడిన వివాదం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి.. మరో స్నేహితుడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అయితే, మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు వారే కావడంతో కోర్టు ఆదేశాలతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి అల్లాపూర్‌కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్ (17) యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇదే కళాశాలలో చదువుతోన్న ఓ రౌడీ షీటర్ కుమారుడు, మరికొంత మందితో అతనికి స్నేహం ఉంది. అయితే, తనతో బంధుత్వం ఉన్న యువతితో డానీష్ చనువుగా ఉండడాన్ని గమనించిన రౌడీషీటర్ కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. ఆ అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు డానీష్‌తో గొడవ పడ్డాడు.

బీరు సీసాలతో దాడి

ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన డానీష్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మరుసటి రోజు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో డానీష్ మృతదేహం లభ్యమైంది. తమ కుమారుణ్ని ఎవరో హత్య చేశారనే అనుమానంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అల్లాపూర్ పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. డానీష్‌ను అడ్డు తొలగించుకునేందుకు రౌడీషీటర్ కుమారుడు తన మిత్రులతో కలిసి కుట్ర పన్నినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. ఫోన్ చేసి ప్లాన్ ప్రకారం డానీష్‌ను తమ వద్దకు రప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. డానీష్ వచ్చాక రౌడీషీటర్ కుమారుడు, అతని మిత్రులు కొంతసేపు గంజాయి తాగి.. అతనిపై ముందే సిద్ధంగా ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. అప్పటికీ డానీష్ చనిపోకపోవడంతో గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

అనంతరం మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా రైలు పట్టాలపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు యత్నించారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలు, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిని కోర్టులో హాజరు పరిచిన అనంతరం.. న్యాయస్థానం ఆదేశాలతో జువైనల్ హోమ్‌కు తరలించారు.

మరో హత్య

అటు, నార్సింగిలోనూ శనివారం మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ 20 రోజుల క్రితమే దుబాయ్ నుంచి నగరానికి వచ్చాడు. శనివారం కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ మహిళ వచ్చి అతన్ని తీసుకెళ్లి గొంతు కోసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో పేట్ మెట్రో స్టేషన్ దగ్గర శుక్రవారం అర్థరాత్రి సయ్యద్ నజఫ్ అలీ అనే రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. మృతుడిపై 3 మర్డర్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2024-06-29T13:14:28Z dg43tfdfdgfd