SUMAN | సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కవు.. ఏపీ రాజకీయాలపై సుమన్‌ కీలక వ్యాఖ్యలు

Suman | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని సినీ నటుడు సుమన్‌ అన్నారు. చంద్రబాబు కార్యసాధకుడు అని.. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ కలిసి ఏపీతో పాటు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. సినీ పరిశ్రమలో వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు. సబ్జెక్ట్‌ తెలిసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌కు మంచి శాఖలనే కేటాయించారని అన్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన తన సత్తా చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు తీరుతాయని నమ్మకం ఉందన్నారు.

ఇక రాజకీయాల నుంచి కమెడియన్‌ అలీ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై స్పందన అడగ్గా.. అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని సుమన్‌ తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్‌ కాదని వెల్లడించారు. ప్రజాసేవ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు.

2024-06-29T08:08:38Z dg43tfdfdgfd