యువహీరో సుధీర్బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకట్ కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధీర్బాబు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మన పురాణాలతో సంబంధం కలిగిన ఎన్నో రహస్యాలను వెలికితీసే కథాంశమిది.
యూనివర్సల్ కాన్సెప్ట్తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. కుట్ర, పన్నాగాలతో కూడిన చెడుకి, నీతి, న్యాయం మూర్తీభవించిన మంచికి నడుమ జరిగే యుద్ధంగా తెరకెక్కించబోతున్నాం. నా కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఆగస్ట్ 15న ఫస్ట్లుక్ విడుదల చేస్తామని నిర్మాతలు ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తారు.
2024-07-01T19:29:41Z dg43tfdfdgfd